Modi Cabinet 3.0: లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. దీంతో ఎన్డీఏ లోక్సభ పక్ష నేతగా నరేంద్ర మోదీ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన మోదీ.. ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆదివారం రాత్రి 7.15 నిమిషాలకు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీతోపాటు 30 మంది మంత్రులు ప్రమాణం చేయనున్నారు. కాగా, ఈ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మెజార్టీ రాకపోవడంతో ఎన్డీఏ కూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే.
కీలక శాఖలు బీజేపీతోనే..
కేబినెట్లో కీలక మంత్రిత్వ శాఖలన్నీ బీజేపీ వద్దే ఉన్నాయి. హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖలను బీజేపీ తీసుకొని కూటమిలోని పార్టీలకు ఇతర మంత్రి పదవులను కేటాయించనుంది. అయితే హోం మంత్రిగా అమిత్ షా, రక్షణమంత్రిగా రాజ్నాథ్ సింగ్, రోడ్డు రవాణా శాఖ మంత్రిగా నితిన్ గడ్కరీ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఈ మంత్రిత్వ శాఖల్లో ఎలాంటి మార్పులు చేయలేదని వార్తలు వినిపిస్తున్నాయి.
కేబినేట్లో ఎవరంటే…
ప్రస్తుతం మోదీ 3.0 వేవ్ కొనసాగుతోంది. మోదీ 3.0లో బీజేపీ నుంచి మరోసారి రాజ్నాథ్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈయనకు మళ్లీ రక్షణ మంత్రిత్వ శాఖ బాధ్యతలు ఇస్తున్నట్లు సమాచారం. అలాగే అమిత్ షా, గడ్కరీ, జైశంకర్, నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్ గోయల్, హర్దీప్ సింగ్ పురీ, జ్యోతిరాదిత్య సింథియా, అశ్వనీ వైష్ణవ్, మన్ సుఖ్ మాండవీయ, సీఆర్ పాటిల్, కిరణ్ రిజిజు మోదీ కేబినేట్లో ఉండే అవకాశం ఉంది. అలాగే వీళ్లతోపాటు శివరాజ్ సింగ్ చౌహాన్, జేపీ నడ్డాను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకోనున్నట్లు సమాచారం.
Also Read: ఎన్డీఏ ఏకపక్ష నిర్ణయాలు ఇకనుంచి చెల్లవు: సోనియా గాంధీ
మరికొంతమంది నేతలకు బెర్త్..
కేంద్ర మంత్రి వర్గంలో కీలక నేతలతోపాటు మరికొంతమంది నేతలకు బెర్త్ దక్కనుంది. వీళ్లలో భూపతి వర్మ, అర్జున్ మేఘవాల్, మనోహర్ లాల్ ఖట్టర్, రావు ఇంద్రజీత్ సింగ్, కమలాజీత్ సెహర్వాత్, భూపేంద్ర యాదవ్, ఎల్ మురగన్,, ప్రహ్లాద్ జోషి, శోభా కర్లాంద్లజె, నిముబెన్, బంబానియా, జువల్ ఓరం, వి.సోమన్న నేతలకు బెర్త్ దక్కే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఐదుగురు..
మోదీ 3.0లో తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి అత్యధికంగా ఐదుగురికి అవకాశం దక్కనుంది. ఏపీలో టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్.. బీజేపీ నుంచి శ్రీనివాస వర్మకు బెర్త్ ఖాయమని వార్తలు వస్తున్నాయి. ఇక, తెలంగాణలో బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్లను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకునేందుకు ఆహ్వానం వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పాటు కూటమి పార్టీల నుంచి మరికొంతమందికి అవకాశం కల్పించారని సమాచారం.