Modi Oath – Delhi Water Crysis: మానవుల ప్రాథమిక అవసరాలలో ఒకటి నీరు. ఇది లేకుండా జీవితాన్ని ఊహించలేము. వేసవి కాలంలో నీటి అవసరం చాలా ఉంటుంది. మరోవైపు నీటి కొరత కూడా చాలా చోట్ల కనిపిస్తోంది. ప్రస్తుతం రాజధాని ఢిల్లీలోని అనేక ప్రాంతాల ప్రజలు ప్రతి నీటి చుక్కపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం నీటి సమస్య కారణంగా ఢిల్లీలోని పలు ప్రాంతాల ప్రజలు ఇళ్లను అమ్ముకుని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటుంది.
ఢిల్లీలో గత కొద్దిరోజులుగా ఈ పరిస్థితి దాపురించింది. ఈ నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇటు నూతన కేంద్ర ప్రభుత్వం నేడు కొలువుదీరనున్నది. ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే, ఈరోజు కూడా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నీట కటకట ఎదురవ్వడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఈరోజు కూడా నీటి కటకట తప్పదా? అంటూ మండిపడుతున్నారు.
ఇందుకు సంబంధించి వచ్చినటువంటి పలు వార్తా కథనాల ప్రకారం.. దక్షిణ ఢిల్లీలోని అంబేద్కర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రజలు ఈ సమస్యపై మాట్లాడుతూ.. నీటి సమస్యతో తాము తీవ్ర ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. ఈ సమస్య చాలా రోజుల నుంచి ఉందని చెబుతున్నారు. అధికారులకు ఈ విషయమై ఎన్నిసార్లు విన్నవించినా కూడా ఎవరూ పట్టించుకోవడంలేదంటున్నారు. ‘చాలా రోజుల నుంచి నీటి సమస్యతో బాధపడుతున్నాం.. నీరు లేకుండా ఎలా జీవించాలి..? అందుకే మా పిల్లలు ఇల్లు అమ్మేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోదాం అంటున్నారు. ఇప్పటికే పలువురు వెళ్లిపోయారు’ అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Cabinet Ministers: ఏ రాష్ట్రానికి ఎక్కువ మంత్రి పదవులు దక్కాయో తెలుసా..?
రాధాకృష్ణ దేవాలయం వెనుక ఉన్నటువంటి వీధిలో అయితే, నీటి సమస్య చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. నీళ్ల కోసం రాత్రంతా మేల్కొని ఎదురుచూడాల్సిన పరిస్థితి ఎదురవుతుందని స్థానికులు చెబుతున్నారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు, మహిళలు ఇలా అందరూ కూడా కేవలం నీటి కోసం మాత్రమే పగలు, రాత్రుళ్లు ఎదురుచూడాల్సి వస్తోందని.. అయినా కూడా నీరు అందుతదన్న గ్యారంటీ లేదంటూ వారు చెబుతున్నారు. రాత్రంతా కూడా నీటి కోసం నిరీక్షించినా కూడా కనీసం రెండు బిందెల నీళ్లు కూడా దొరకడంలేదని, ఇప్పుడే సమస్య ఇలా ఉంటే భవిష్యత్ లో ఎలా ఉండబోతుందంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్యాంకర్ ను పిలవాలంటే రూ. 2 వేలు చెల్లించాల్సి వస్తోందని, అయినా కూడా కొన్నిసార్లు అవి కూడా దొరకడంలేదని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకుని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
Also Read: బ్రేకింగ్ న్యూస్.. జనసేన పార్టీకి నాలుగు మంత్రి పదవులు?
అయితే, నేడు ప్రధానిగా మోదీ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అదే.. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నీటి సమస్యతో ప్రజలు అల్లాడుతుండడంతో దేశవ్యాప్తంగా ఈ అంశంపై తీవ్ర చర్చ నడుస్తోంది. ప్రమాణస్వీకారం తరువాతనైనా ప్రధాని ఈ సమస్యపై ఫోకస్ చేయాలంటూ పలువురు మేధావులు, ప్రజలు కోరుతున్నారు.