4 Minister Seats for Janasena in AP Cabinet: నేడు భారత ప్రధానమంత్రిగా మూడోసారి మోదీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. పలువురు ఎంపీలు కూడా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం రాష్ట్రపతి భవన్ లో రాత్రి 7.15 గంటలకు జరగనున్నది. అయితే, తెలుగు రాష్ట్రాల నుంచి పలువురికి మోదీ కేబినెట్ లో మంత్రి పదవులు దక్కాయి. తెలంగాణ నుంచి ఇద్దరికి, ఏపీ నుంచి ముగ్గురికి మంత్రి పదవులు దక్కాయి. ఎన్డీయే కూటమిలో బీజేపీ తరువాత టీడీపీయే రెండో అతిపెద్ద పార్టీ. ఈ పార్టీకి మంత్రి పదవులు దక్కాయి. ఇటు జనసేన పార్టీకి మాత్రం కేంద్ర కేబినెట్ లో చోటు దక్కలేదు. భవిష్యత్తులో దక్కే అవకాశముందంటూ పేర్కొంటున్నారు.
కేంద్రంలో జనసేనకు చోటు విషయాన్ని అటు ఉంచితే, రాష్ట్ర కేబినెట్ లో మాత్రం నాలుగు మంత్రి పదవులు దక్కే అవకాశం లేకపోలేదని చర్చ జోరుగా నడుస్తోంది. ఏపీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేసిన జనసేన పార్టీ ఈసారి చరిత్ర సృష్టించింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచింది. పైగా రెండు ఎంపీ స్థానాలను సైతం సొంతం చేసుకుంది. ఈ క్రమంలో రాష్ట్ర కేబినెట్ లో జనసేనకు అత్యంత ప్రాధాన్యత ఉండనున్నది. పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను డిప్యూటీ సీఎం పదవి వరించనున్నట్లు ఇప్పటికే వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.
అయితే, ఇందుకు సంబంధించి చంద్రబాబు.. ఇప్పటికే పవన్ కల్యాణ్ కు స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. నాలుగుకు మించకుండా మంత్రి పదవులు ఇచ్చే అవకాశమున్నట్లు సమాచారం. కేంద్రంలో అవకాశం రాకపోవడంతో మరో మంత్రి పదవి కూడా ఇచ్చే ఛాన్స్ ఉందంటూ నేతలు చర్చించుకుంటున్నారు. నాదెండ్ల మనోహర్ కు కూడా మంత్రి పదవి దక్కే అవకాశమున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Also Read: తెలంగాణ నుంచి ఇద్దరు, రామ్మోహన్ తొలి పలుకులు, ఆ విషయంలో..
ఏపీలో కూటమి అత్యధిక సీట్లను కైవసం చేసుకోవడంలో జనసేన కీలక పాత్ర పోషించింది. వైసీపీకి కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. మిగతా సీట్లు మాత్రం కూటమికే దక్కాయి. ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానితోపాటు పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, పలు రంగాలకు చెందినటువంటి ప్రముఖులు హాజరుకానున్నారు. ఆరోజు తెలిసే అవకాశముంది. కూటమిలోని ఏ పార్టీలకు ఎన్ని మంత్రి పదవులు దక్కాయనేది.