Pawan Kalyan: ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు ఈనెల 5న శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తాయి. వెంటనే ఆయనను హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించగా.. శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులతోపాటు రాజకీయ నాయకులు సంతాపం తెలుపుతున్నారు. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. హైదరాబాద్ ఫిల్మ్ సిటీలో ఉంచిన రామోజీరావు పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆయనతోపాటు ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్, నిర్మాత రాధాకృష్ణ (చినబాబు) కూడా ఉన్నారు. అనంతరం రామోజీరావు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పవన్ కల్యాణ్ భావోద్వేగం..
రామోజీరావు మరణ వార్త తీవ్ర దిగ్భ్రాందికి గురిచేసిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేరుగా నేనే వచ్చి రామోజీరావును కలుద్దామని అనున్నానని, ఇంతలోనే దురదృష్టవశాత్తూ ఇలాంటి వార్త వచ్చిందని భావోద్వేగం వ్యక్తం చేశారు. తెలుగు పరిశ్రమకు ఎంతో కృషి చేశారని, ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలతో రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించారని గుర్తు చేశారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో వేలాది జర్నలిస్టులకు దిశా నిర్ధేశం చేశారన్నారు. ఈనాడు జర్నలిజం స్కూల్ స్థాపించి ఎంతోమంది జర్నలిస్టులను అందించిన మహానుభావుడని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు అండగా ఉండాలని, జనసేన తరఫున సంతాపం తెలియజేస్తున్నాని పవన్ కల్యాణ్ ఎమోషనల్ అయ్యారు.
Also Read: నేను ఎప్పుడైనా చనిపోతే నా సమాధి ఉంది… చూద్దురు అనేవారు
రామోజీరావును వేధించారు
దార్శనికుడు రామోజీరావును గత కొంతకాంలంగా కొంతమంది ఇబ్బంది పెట్టారని పవన్ కల్యాణ్ అన్నారు. గత ప్రభుత్వాలు సైతం ఇబ్బంది పెట్టాయని, ఎంతమంది ఇబ్బంది పెట్టినప్పటికీ ఈ వయస్సులో కూడా రామోజీరావు తట్టుకొని నిలబడ్డారన్నారు. ఆయనను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు ఈ రోజు లేవని.. ఇదే విషయాన్ని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనను స్వయంగా కలిసి చెప్పాలని అనుకున్నానని పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి అందరికీ అండగా నిలబడిన మహాగొప్పవేత అన్నారు. కాగా, అంతకుముందు ప్రభుత్వాలు రామోజీరావును ఇబ్బంది పెట్టాయని సినీ హీరో రాజేంద్రప్రసాద్ కూడ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.