Ramoji Rao: రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా నివాళులర్పించింది. రామోజీరావు మృతికి నివాళిగా రెండురోజులపాటు సంతాప దినాలను ప్రకటించింది. రేపు, ఎల్లుండి సంతాప దినాలను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు రోజులపాటు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అధికారిక కార్యక్రమాలను నిర్వహించబోదు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఉత్తర్వులను విడుదల చేశారు.
రామోజీరావు శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించగా.. సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయనకు నివాళులర్పిస్తున్నారు.
చంద్రబాబు దంపతులు, లోకేశ్, పవన్ కల్యాణ్, చిరంజీవి, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. రామోజీరావు పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం రామోజీ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. రామోజీరావు మరణ వార్త తమకు తీవ్ర దిగ్భ్రాంతిని కలగజేసిందని పేర్కొన్నారు. ఎంతోమంది జర్నలిస్టులను అందించిన మహానుభావులు ఆయన అని అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతో చేశారన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు అండగా ఉండాలని వారు పేర్కొన్నారు.
Also Read: ఏపీ ప్రత్యేక హోదాపై నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు..
రామోజీరావు మరణంతో కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని ఆయన స్వగ్రామం పెదపారుపూడిలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మరణ వార్త విని గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. పెదపారుపూడిలో ఆయన చిత్రపటానికి గ్రామస్తులు నివాళులర్పించారు. ఆ గ్రామానికి రామోజీరావు చేసిన సేవలను కొనియాడారు.