Fish prasadam distribution: చేప ప్రసాదం పంపిణీలో విషాదం చోటు చేసుకుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం కోసం లైన్లో నిలబడ్డ వ్యక్తి సొమ్మసిల్లి కిందపడిపోయాడు. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలుస్తోంది. మృతుడు నిజామాబాద్ జిల్లా వాసిగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
అయితే, శుక్రవారం సాయంత్రం చేప మందు కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. టోకెన్ల కోసం క్యూలైన్లలో నిల్చున్నారు. లైన్ లో నిల్చున్న ఓ వ్యక్తి ఒక్కసారిగా కిందపడిపోయాడు. ఇది గమనించిన పలువురు అతడిని తట్టిలేపే ప్రయత్నం చేశారు. అయినా అతడిలో ఎలాంటి చలనం లేకపోవడంతో విషయం పోలీసులకు చేరవేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అతడి ముఖంపై నీళ్లు చల్లారు. అయినా కూడా అతడు స్పందించకపోవడంతో సీపీఆర్ చేశారు. అయినా కూడా ఎలాంటి ఫలితం లేకపోవడంతో అంబులెన్స్ ను పిలిపించి అతడిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో అతను చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి, మృతుడి వివరాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.
Also Read: దేశంలోనే ప్రథమం.. అధికార లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు..
చేప మందు కోసం వచ్చిన వ్యక్తి తిరిగిరానిలోకాలకు వెళ్లడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన చోటు చేసుకోవడంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరోగ్యం విషయంలో ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే వారు నిలబడినచోటే సేద తీరి, సమాచారం ఇవ్వాలని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. కాగా, హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం ఇవాళ, రేపు పంపిణీ చేస్తున్న విషయం విధితమే.