Daggubati Venkatesh: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విజయంపై రాజకీయ ప్రముఖులతోపాటు సినీ పరిశ్రమ పెద్దలు అభినందనలు తెలిపారు. అయితే రాజకీయాలకు దూరంగా ఉండే విక్టరీ వెంకటేష్ మాత్రం స్పెషల్ విషెష్ తెలిపారు. ‘పిఠాపురం..ఎమ్మెల్యే గారు’ అంటూ ఓ ఆసక్తికరంగా ట్వీట్ చేస్తూ అభినందనలు తెలిపిన విక్టరీ వెంకటేష్… తాజాగా, ఇన్స్ట్రాగ్రామ్ వేదికగా మరో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఇందులో ‘ప్రపంచంలో ఏదైనా సరే.. ఏదో ఒకరోజు మారుతోంది’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హేటర్స్ లేని హీరో..
టాలీవుడ్లో హేటర్స్ లేని హీరో అంటూ ఎవరైనా ఉన్నారంటే అతనే విక్టరీ వెంకటేష్. వరుస విజయాలతో విక్టరీగా గుర్తింపు తెచ్చుకున్నారు. తన సినిమాల్లో కూడా రాజకీయాల రోల్ చేసేందుకు ఇష్టపడని వెంకటేష్.. ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత వరుసగా పోస్ట్ చేయడం ఏంటి? అని అభిమానులతోపాటు రాజకీయ వేత్తలు ఆశ్చర్యపోతున్నారు. ఎన్నికల ఫలితాలకు ముందు కూడా ఖమ్మం జిల్లాలో తన వియ్యంకుడు, కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి తరఫున ప్రచారం చేశారు. అయితే ఈ ఎన్నికల్లో రఘురాంరెడ్డి సుమారు 4 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.
Also Read: చివరి రోజుల్లో ఆయన్ను దుర్మార్గులు చాలా క్షోభ పెట్టారు.. రాజేంద్ర ప్రసాద్ ఎమోషనల్
ఒక్క పోస్ట్.. ఎన్నో అర్ధాలు!
ఎన్నికల ఫలితాల తర్వాత విక్టరీ వెంకటేష్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చారిత్రాత్మక విజయం నమోదు చేయడంపై విక్టరీ వెంకటేష్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. ఇందులో భాగంగా సోషల్ మీడియా వేదికగా మరో పోస్ట్ చేశారు. అయితే వైసీపీ అధినేత జగన్కు ఘోర ఓటమి ఎదురుకావడం, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి భారీ విజయం నేపథ్యంలోనే ఒక్కోరోజులో ఏదైనా మారవచ్చు..అని పోస్ట్ చేసినట్లు కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అదే విధంగా దేశవ్యాప్తంగా బీజేపీకి మెజార్టీ తగ్గడం, కూటమికి బలం పెరిగింది. అలాగే ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు ఉదయం మృతి చెందడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆనందం, సంతోషం, బాధ తెలియజేస్తూ పోస్ట్ చేశాడా? అంటూ పలువురు అనుకుంటున్నారు. దీంతోపాటు మరో పోస్ట్లో రామోజీరావుకు నివాళులర్పించారు.