Firing in Jammu Kashmir Border(Latest telugu news): జమ్మూకశ్మీర్ లోని సాంబా జిల్లా అంతర్జాతీయ సరిహద్దులో అనుమానాస్పద కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒకరు మరణించగా.. శనివారం అధికారులు అక్కడ బలగాలను మోహరించారు. సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో 28 ఏళ్ల కార్మికుడి ఛాతీలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో.. అతను అక్కడికక్కడే మరణించాడు. మృతుడిని అధికారులు వాసుగా గుర్తించారు.
గాయపడిన వెంటనే వాసుని ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. మృతుడు అంతర్జాతీయ సరిహద్దులో ఉన్న ఒక నిర్మాణ ప్రాజెక్టులో పనిచేస్తున్నాడని, ఆ సమయంలోనే అతను కాల్పులకు గురయ్యాడని అధికారులు తెలిపారు. ఈ కాల్పులతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఘటనపై పోలీస్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎన్నికల సమయంలోనూ జమ్మూకశ్మీర్ లో కాల్పులు జరిగాయి. మే 18న ఉగ్రవాదుల దాడిలో బీజేపీ మాజీ సర్పంచ్ ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. షోపియాన్ జిల్లా హుర్ పురా గ్రామంలో బీజేపీ మాజీ సర్పంచ్ ఐజాజ్ అహ్మద్ షేక్ పై కాల్పులు జరగ్గా వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. జైపూర్ కు చెందిన దంపతులు కూడా ఈ దాడిలో గాయపడ్డారు.