Ramoji Rao Died without fulfilling his goal as Producer: మీడియా పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. మీడియా మొఘల్ రామోజీరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అయితే శనివారం పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని స్టార్ ఆస్పత్రిలో తెల్లవారుజామున 4:50 గంటలకు తుదిశ్వాస విడిచారు. దీంతో మీడియా ప్రపంచంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన పార్థీవ దేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించారు. రామోజీరావు గురించి.. ఆయన సృష్టించిన సామ్రాజ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
1936 నవంబర్ 16న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు. 1974 ఆగస్టు 10న విశాఖ తీరంలో ఈనాడు దినపత్రికను ప్రారంభించారు. ఒక వార్తను.. ఎలాంటి మసాలాలు యాడ్ చేయకుండా ప్రజలకు అందించిన ఏకైక పత్రిక ఈనాడు మాత్రమే. ఇప్పటికీ అదే పంథాను రామోజీరావు ఫాలో అవుతున్నారు. ఆయన స్థాపించని సంస్థ అంటూ లేదు. మార్గదర్శి చిట్ ఫండ్, ఈనాడు వార్తాపత్రిక, ఈటీవీ నెట్వర్క్, రమాదేవి పబ్లిక్ స్కూల్, ప్రియా ఫుడ్స్, కళాంజలి, ఉషాకిరణ్ మూవీస్.. ఇలా అన్నింటి లోనూ విజయకేతనం ఎగురవేశారు. ముఖ్యంగా రామోజీ ఫిల్మ్ సిటీ. అసలు ఇది లేకపోతే హైదరాబాద్ లో సినిమాల షూటింగ్ లు ఉండేవే కాదనడంలో అతిశయోక్తి లేదు.
నిత్యం ఎన్నో షూటింగ్స్ జరుగుతుంటాయి. ఇతర భాషల ఇండస్ట్రీలకు చెందిన వారు ఇక్కడ షూటింగులు ఉంటే.. తమ కుటుంబాలతో సహా వచ్చి సేదతీరుతారు. రామోజీ ఫిల్మ్ సిటీ.. లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్సిటీ ఇన్ ది వరల్డ్ గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం పొందింది. ఈ ఫిల్మ్సిటీలో కేవలం తెలుగు సినిమాలే కాదు.. బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు సైతం షూటింగ్ జరుపుకున్నాయి. జరుపుకుంటున్నాయి కూడా. ఇక కేవలం ఇదే కాకుండా ఒక బ్యానర్ ను కూడా నిర్మించి.. అందులో మంచి మంచి సినిమాలు తెరకెక్కించి ప్రేక్షకులకు అందించారు. అదే ఉషాకిరణ్ మూవీస్. ఈ ఉషా కిరణాలు.. అంటూ వచ్చే మ్యూజిక్ తోనే అప్పట్లో పిల్లలు నిద్ర లేచేవారు అంటే అతిశయోక్తి కాదు. “ఈ ఉషా కిరణాలు.. తిమిర సంహరణాలు.. చైతన్య దీపాలు. మౌన ప్రబోధాలు.. జగతికి ప్రాణాలు.. ప్రగతి రథచక్రాలు.. ఈ ఉషా కిరణాలు.. తిమిర సంహరణాలు..” అంటూ సాగే ప్రోమో సాంగ్ వినసొంపుగా ఉండేది. హృద్యమైన కథలకు ఈనాడు సంస్థ పెట్టింది పేరు అనే చెప్పాలి.
Also Read: దేశంలోనే ప్రథమం.. అధికార లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు..
అయితే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకున్నా యువ దర్శకులకూ, నటీనటులకు అవకాశాలిచ్చి, వారి ప్రతిభను బయటకు తీసుకొచ్చి ఎందరినో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసింది. అలాంటి బ్యానర్ కొంతకాలంగా కనుమరుగయ్యింది. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ లో చివరగా వచ్చిన చిత్రం దాగుడు మూతలు దండాకోర్. రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం రిలీజ్ అయిందన్న విషయం కూడా చాలామంది ప్రేక్షకులకు తెలియదు.
అన్ని సంస్థల్లో విజయం అందుకున్న రామోజీరావు.. నిర్మాణ రంగంలో కూడా మళ్లీ పుంజుకోవాలని చూశారు. 2019 నుంచి ఆయన మంచి కథలను కూడా విన్నారట. అంతేకాకుండా ఉషాకిరణ్ దాదాపు 85 సినిమాల్ని రూపొందించింది. మరో 15 తీస్తే వంద సినిమాలు తెరకెక్కించిన ఘనత దక్కుతుందని కూడా ఆలోచించిన ఆయన ఎలాగైనా మళ్లీ ఉషా కిరణ్ మూవీస్ ను తిరిగి ప్రారంభించి.. విజయం సాధించాలని ప్రయత్నాలు సాగించారు. కానీ కోరిక తీరకుండానే నేడు ఆయన మృతి చెందారు. 100 సినిమాలు చేయాలన్న ఆయన కోరికను.. వారసులు నెరవేరుస్తారేమో చూడాలి.