Sachin Pilot: లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 240 సీట్లు మాత్రమే రావడంతో ఎన్డీఏ కూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే గత ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు సాధించగా.. ఈసారి 63 సీట్లు తగ్గాయి. ఓట్ల పరంగా చూస్తే.. 2019 ఎన్నికల్లో బీజేపీకి 37.7 శాతం ఓట్లు పొందగా.. ఈ ఎన్నికల్లో 36.56 శాతం ఓట్ల పడ్డాయి. అయితే కాంగ్రెస్ విషయంలో దీనికి విరుద్ధంగా ఉంది. గత ఎన్నికల్లో 52 సీట్లు మాత్రమే సాధించగా.. ఈసారి 99 సీట్లకు పెరిగాయి. ఓట్ల పరంగా.. గతంలో 19.70శాతం ఓట్లు రాగా, 2024లో 21.19శాతం ఓట్లు దక్కాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై బీజేపీపై కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ ఫలితాలపై బీజేపీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు.
ప్రజల నుంచి వ్యతిరేకత..
2024 ఎన్నికల్లో బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, అందుకే ఆ పార్టీకి సీట్లు తగ్గాయని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ అన్నారు. ఈ సందర్భంగా గతలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వ్యవహరించిన తీరును గుర్తు చేశారు. 1989 ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి 197 సీట్లు మాత్రమే వచ్చాయన్నారు. అయినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని రాజీవ్ గాంధీని ఇతర పార్టీలు కోరాయి. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అతను ఒప్పుకోలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదని, ప్రజలు తీర్పు తనకు అనుకూలంగా ఉంటే.. ఇంకా మరిన్ని సీట్లు వచ్చేవన్నారు. అందుకే రాజీవ్ గాంధీ తర్వాతి స్థానంలో ఉన్న మరో పెద్ద పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సూచించారని సచిన్ పైలట్ పేర్కొన్నారు.
Also Read: పవనంటే ఒక తుపాన్.. జనసేనానిపై మోదీ ప్రశంసలు
మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొద్దని సూచన
1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 197 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. తర్వాతి స్థానంలో జనతాదళ్ పార్టీకి 143 స్థానాలు వచ్చాయి. ఈ సమయంలో ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మెజార్టీ లేదు. అయితే ఆనాడు రాజీవ్ గాంధీ తిరస్కరించడంతో వీపీ సింగ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లు మాత్రమే వచ్చాయి. 272 మ్యాజిక్ ఫిగర్ దాటకపోయినా.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమితో కలిసి 293 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ విషయంపై కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ గతంలో రాజీవ్ గాంధీ వదులుకున్నట్లే.. నరేంద్రమోదీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించకూడదని సూచించారు. కాగా, ఈ ఎన్నికల్లో బీజేపీ తర్వాత కాంగ్రెస్ 99 స్థానాలను సాధించిన సంగతి తెలిసిందే.