Four Indian Medical Students drown in Russia: రష్యాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సెయింట్ పీటర్స్ బర్గ్లో నలుగురు భారతీయ విద్యార్థులు నదిలో పడి కొట్టుకుపోయారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి రెస్క్యూ సిబ్బంది చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. గల్లంతైన నలుగురిలో ఒకరి మృతదేహాన్ని వెలికితీశారు. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
కాపాడే ప్రయత్నంలో..
సెయింట్ పీటర్స్ బర్గ్లోని యరోస్టోవ్ ది వైస్ నోవోగోరోడ్ స్టేట్ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతున్న విద్యార్థులు వోల్ఖోవ్ నది ఒడ్డున వాకింగ్ చేస్తున్నారు. ఈ సమయంలో ఓ యువతి నది ఒడ్డుపై నడుస్తుండగా.. ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలోకి పడిపోయింది. అక్కడే ఉన్న ఆ నలుగురు విద్యార్థులు ఆమెను కాపాడేందుకు నదిలోకి దూకారు. ఈ ప్రమాదంలో నలుగురు కొట్టుకుపోగా.. ఆ యువతిని స్థానికులు కాపాడారు. ఇందులో ఓ విద్యార్థి మృతదేహం లభ్యమైంది. మిగతా మృతదేహాల కోసం గాలిస్తున్నారు.
మృతులు వీళ్లే..
నదిలో కొట్టుకుపోయిన విద్యార్థులు హర్షల్ అనంత్ రావ్, జీషన్ పింజారీ, జియా పింజారీ, మాలిక్ మహ్మద్ యాకుబ్గా గుర్తించారు. ఇందులో జీషన్ పింజారీ, జియా పింజారీ, హర్షల్ అనంత్ రావ్లవి మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాకు చెందిన వారని తెలిసింది. వీరంతా నోవోగోరోడ్ స్టేట్ యూనివర్సిటీలో మెడిసిన్ చదివేందుకు వెళ్లారు. ప్రస్తుతం యువతికి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంపై పోలీసులను అడగగా.. ఎలాంటి సమాచారం లేదని వెల్లడించారు. అయితే దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో 5 దేశాలు ఎంపిక.. పాకిస్తాన్కు చోటు?
బాధిత కుటుంబాలను ఆదుకుంటాం..
రష్యా దేశానికి మెడిసిన్ చదివేందుకు వెళ్లి నదిలో మృతి చెందిన ప్రమాదంపై మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా కలెక్టర్ పీయూష్ ప్రసాద్ స్పందించారు. ఈ ప్రమాదం దురదృష్టకర ఘటన అని, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. మృతదేహాలను భారత్కు తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ విషయంపై భారత దౌత్య కార్యాలయం అధికారులతో సంప్రదింపులు చేస్తున్నట్లు చెప్పారు. కాగా, రష్యాలో మెడిసిన్ చదివేందుకు తక్కువ ఖర్చు కావడంతో భారత్ నుంచి చాలామంది ఆ దేశానికి క్యూ కడుతున్న సంగతి తెలిసిందే.