టాస్ గెలిచిన ఉగండా మొదట బౌలింగ్ తీసుకుంది. దీంతో బ్యాటింగ్ కి వచ్చిన పపువా న్యూగినీ 19.1 ఓవర్లలో 77 పరుగులకు ఆలౌట్ అయ్యింది. లక్ష్య ఛేదనలో ఉగండా 18.2 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసి విజయ కేతనం ఎగురవేసింది.
78 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఉగండాకు అంత శుభారంభం దక్కలేదు. మొదట్లోనే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 1/1, 6/2, 6/3, 25/4, 26/5తో వరుసగా వికెట్లుగా కోల్పోయింది. అలా 26 పరుగులు వచ్చేసరికి 5 వికెట్లు కోల్పోయి గిలగిల్లాడింది. ముగ్గురు డక్ అవుట్లు అయ్యారు. ఇద్దరు ఒకొక్క పరుగు చేసి అవుట్ అయ్యారు. దీంతో మ్యాచ్ పపువా న్యూగినీ వైపు మళ్లింది. ఈ పరిస్థితుల్లో బ్యాటింగ్కు వచ్చిన జుమా మియాగీ (13) తో కలిసి రియాజత్ అలీషా (33) ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.
ఒక దశలో టెస్ట్ మ్యాచ్ తలపించే దశలో టీ 20 మ్యాచ్ సాగింది. ఈ క్రమంలో వీరిద్దరూ ఆరో వికెట్ కు 35 పరుగులు జోడించి.. వెంటవెంటనే అవుట్ అయిపోయారు. దీంతో మళ్లీ మ్యాచ్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. చివరికి కెన్నెత్ (7 నాటౌట్) మరో పొరపాటు చేయకుండా జట్టుని విజయతీరాలకు చేర్చాడు.
Also Read: అమెరికా ఎలా గెలిచింది?.. పాక్ ఎలా ఓడింది?
పపువా న్యూగినీ బౌలింగులో అలై నావో 2, నార్మన్ 2, చాద్ సోపర్ 1, కెప్టెన్ అస్సద్ వాలా 1 వికెట్ పడగొట్టారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన పపువా న్యూగినీ ప్రారంభంలోనే చేతులెత్తేసింది. ఓపెనర్లుగా వచ్చిన కెప్టెన్ అస్సద్ వాలా (0), టోనీ ఉరా (2), ఫస్ట్ డౌన్ వచ్చిన సెసె బావు (5) ఇలా క్యూ కట్టారు. చివరికి రెండంకెల స్కోరుని హిరి హిరి (15), కిప్లిన్ దొరిగా (12), లెగా సైకా (12) ముగ్గురే చేశారు. అలా పడుతూ లేస్తూ ఎట్టకేలకు 19.1 ఓవర్ లో 77 పరుగులకు పపువా న్యూగినీ ఆలౌట్ అయ్యింది.
ఉగండా బౌలింగులో రంజానీ 2, కాస్మోస్ 2, జుమా మియాగి 2, మసాబా 1, ఫ్రాంక్ 2 వికెట్లు పడగొట్టారు.