Shivraj Singh Chouhan Likely to Get Bigger Role in BJP: మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ రాజకీయ జీవితం ముగిసిపోయిందా? లేక ఇంకా పొలిటికల్ కెరీర్ ఉందా? ఇవే ప్రశ్నలు కొన్నాళ్ల కిందట మధ్యప్రదేశ్ బీజేపీ ప్రజలను వెంటాడాయి. తాజాగా ఆయనకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన ఫుల్ ఖుషీగా ఉన్నారు.
ఇంతకీ మోదీ కేబినెట్లోకి చేరుతారా? లేక బీజేపీ జాతీయ అధ్యక్షుడి పదవి అప్పగిస్తారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. శివరాజ్సింగ్కు అత్యంత కీలక బాధ్యతలు దక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమిస్తారనే వార్తలు జోరందుకున్నాయి. వెంటనే ఢిల్లీకి రావాలని ఆయనకు బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో భోపాల్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
లోక్సభ ఎన్నికల్లో విదిశ నుంచి దాదాపు 8 లక్షల పైచిలుకు భారీ మెజార్టీతో గెలుపొందారు మాజీ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్. ఇదే నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలిచారాయన. అంతకుముందు వాజ్పేయి, సుష్మాస్వరాజ్ కూడా అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.
Also Read: ‘ఒకవేళ ఎన్డీఏ కూటమి 400 సీట్లకు పైగా సాధిస్తే.. ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చేవారే’
మొన్నటి మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శివరాజ్సింగ్ చౌహాన్ కాకుండా ఆయన కేబినెట్లో పనిచేసిన మోహన్ యాదవ్ను సీఎంను చేసింది బీజేపీ హైకమాండ్. దీంతో శివరాజ్సింగ్ పొలిటికల్ కెరీర్ ముగిసిపోయిందని వార్తలు వచ్చాయి. బీజేపీలో ఎక్కువకాలం సీఎంగా పనిచేసిన వ్యక్తుల్లో శివరాజ్ ముందు ఉంటారు. కంటిన్యూగా 16 ఏళ్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం.
అయితే లోక్సభ ఎన్నికల సందర్భంలో మాజీ సీఎంకు ప్రధాని నరేంద్రమోదీ మాట ఇచ్చారు. తనతోపాటు చౌహాన్ ను ఢిల్లీకి తీసుకెళ్తానని మాట ఇచ్చారు. అన్నమాట ప్రకారం ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ప్రస్తుతం బీజేపీలో ఈ స్థాయి అనుభవం ఉన్న నాయకుడు ఎవరూ లేరు. దీంతో ఆయనను జాతీయ అధ్యక్షుడిగా నియమించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. మరి శివరాజ్ను ప్రధాని మోదీ కేబినెట్లోకి తీసుకుంటారా? లేక అధ్యక్షుడి బాధ్యతలు అప్పగిస్తారా అనేది చూడాలి.