Telangana MP’s in Modi Cabinet: గతంలో నాలుగు సీట్లు ఉన్నాయి. ఒక్కటి అదనంగా గెలిచినా చాలు.. అది మాకు బోనస్సే.. ఇది లోక్సభ ఎలక్షన్స్ ముందు బీజేపీ నేతల మాటలు.. బట్ ప్రజలు మాత్రం వారి అంచనాలకు మించి సీట్లు ఇచ్చారు. ఏకంగా ఎనిమిది మంది బీజేపీ అభ్యర్థులను గెలిపించారు. మరి ఇది తెలంగాణకు మంచి చేయబోతుంది? గెలిచారన్న సంతోషమేనా? మరి మనకు జరిగే లాభం ఏమైనా ఉందా? ప్రజలు ఆశిర్వదించారు.. మేము అనుకున్నదానికంటే చాలా బాగా పోరాడాము.. ఇవి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి చెబుతున్న మాటలు.. యస్.. నిజంగానే మొత్తం 17 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చారు. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల చరిత్రలో బీజేపీ ఈ స్థాయిలో సీట్లు గెలుచుకోవడం ఇదే ఫస్ట్ టైమ్.. మరి తెలంగాణ ప్రజలకు బీజేపీ ఎలాంటి రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది? రాష్ట్రానికి ఏం మేలు చేస్తుంది? ఇదే ఇప్పుడు మెయిన్ క్వశ్చన్.
లాస్ట్ లోక్సభ ఎలక్షన్స్లో తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుంది. ఇప్పటి బీఆర్ఎస్.. అప్పటి టీఆర్ఎస్ హవా నడుస్తున్న సమయం అది. ఆ హవాలో కూడా అనూహ్యంగా నాలుగు ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది బీజేపీ. దీనికి ప్రతిఫలంగా ఒక కేంద్ర సహాయమంత్రి పదవిని కల్పించింది అప్పటి మోడీ సర్కార్.. బస్.. అంతే.. అంతకుమించి రాష్ట్రానికి జరిగిన వృద్ధి ఏం లేదనేది ఇప్పటికీ ఉన్న విమర్శలు. ప్రాజెక్టులు, నిధుల విషయంలో కూడా కేంద్ర నుంచి తెలంగాణకు ఒరిగిందేం లేదన్న టాక్ ఉంది. కానీ ఈసారి సిట్యూవేషన్ వేరు. కాస్త అన్యాయం జరిగిందని ప్రచారం జరిగినా.. తెలంగాణ ప్రజలు దానిని పక్కన పెట్టారు. బీజేపీకి జై కొట్టారు.. ఎనిమిది మంది ఎంపీలను గెలిపించారు. మరి ఈసారైనా న్యాయం జరుగుతుందా? తెలంగాణ బీజేపీ ఎంపీలకు కీలకమైన మంత్రిత్వశాఖలు దక్కుతాయా?
ఇప్పుడు దీనిపైనే తెలంగాణ పొలిటికల్ సర్కిళ్లలో హాట్ డిబేట్ నడుస్తుంది..
అయితే ఈసారి నలుగురికి మంత్రి పదవులు దక్కుతాయన్న చర్చ నడుస్తుంది. నిజానికి బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ ఎంపీలుగా గెలవడం ఇది రెండోసారి.. సో.. వీరిద్దరు కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు. తొలిసారి విజయం సాధించిన డీకే అరుణ, ఈటల రాజేందర్ కూడా మంత్రి పదవి రేసులో ఉండే చాన్స్ ఉంది. గతంలోనే కిషన్ రెడ్డి మంత్రి పదవి దక్కించుకున్నారు కాబట్టి.. ఆయనకు ఈసారి మళ్లీ పదవి ఇస్తారా? లేదా? అనేది డౌట్.. బీసీ కోటాలో ఈటలకు లేదా బండి సంజయ్కు.. మహిళా కోటాలో డీకే అరుణకు పదవీయోగ్యం దక్కే చాన్స్ ఉంది.
Also Read: ఓట్ల లెక్కింపులో అవకతవకలు : రాకేశ్ రెడ్డి
అయితే బీజేపీకి పూర్తి స్థాయిలో మెజార్టీ రాకపోవడం చాలా మంది ఆశావాహులకు దెబ్బ అనే చెప్పాలి. ఎందుకంటే బీజేపీ మిత్ర పక్షాలు డిమాండ్స్ పెరిగిపోయాయి. తమకు కావాల్సిన మంత్రి పదవులు ఇన్ని.. శాఖలు ఇవి.. అంటూ చాంతాడంతా లిస్ట్ను బీజేపీ పెద్దల ముందు ఉంచుతున్నారు. సో.. ఎక్కువ సంఖ్యలో మంత్రి పదవులు మిత్ర పక్షాలకు వెళితే.. చాలా వరకు బీజేపీ ఆశావాహులకు పదవులు దక్కే అవకాశం ఉండకపోవచ్చు. అందులో తెలంగాణ బీజేపీ ఎంపీలు ఉండే అవకాశం కూడా లేకపోలేదు.
అయితే మోడీ సర్కార్ చాలా విషయాల్లో తెలంగాణకు మొండి చేయ్యే చూపించిందని చెప్పాలి. ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని నిర్మిస్తామన్నారు. దానిని నాన్చి నాన్చి.. చివరకు మరమ్మతుల కేంద్రంగా మార్చేశారు. అది కూడా ఎన్నికల ముందు ప్రకటించారు. ఇక నిజామాబాద్ పసుపు బోర్డు కూడా.. ఐదేళ్లు నాన్చి నాన్చి.. దానిని కూడా సరిగ్గా ఎన్నికల ముందు అనౌన్స్ చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అయితే అటకెక్కింది. ట్రైబల్ యూనివర్సిటీ డీపీఆర్కే పరిమితమైంది. మామునూరు ఎయిర్పోర్ట్ విషయమైతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది. ఇవన్నీ పాత ప్రాజెక్టులో.. మరి వీటిని పూర్తి చేసి మమ అనిపిస్తారా? లేక కొత్త వాటిని ఏమైనా రాష్ట్రానికి తీసుకొస్తారా? అనేది చూడాలి.
Also Read: Ramojirao Funeral: దేశంలోనే ప్రథమం.. అధికార లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు..
యస్.. ఈటల రాజేందర్ గారు చెప్పింది నిజమే. ఎన్నో కలలతో బీజేపీ ఎంపీలను గెలిపించారు తెలంగాణ ప్రజలు. మీ పార్టీ ఓట్ షేర్ను పెంచారు. మీరు కూడా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకండి. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ.. ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయండి.