Congress slams: పార్లమెంటు ప్రాంగణంలో ఉన్నటువంటి మహనీయుల విగ్రహాలను వేరే చోటుకు తరలించడం వివాదాస్పదమైంది. మహాత్మాగాంధీ, అంబేద్కర్ వంటి విగ్రహాలు ఉండడంతో దీనిపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. వాటిని అక్కడి నుంచి తొలగించడంతో బీజేపీపై మండిపడుతుంది.
విగ్రహాల తరలింపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించి తాజాగా ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘ఛత్రపతి శివాజీ మహారాజ్, మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేసిన ప్రదేశం నుంచి తొలగించారు. ఇది అత్యంత దారుణం’ అంటూ జైరాం రమేష్ ఆ పోస్ట్ లో పేర్కొన్నారు.
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా స్పందించారు. ఒకవేళ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు 400లకు పైగా సీట్లు వస్తే.. ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చేవాళ్లే అంటూ ఖేరా ఆరోపించారు.
అయితే, లోక్ సభకు ఎన్నికైన సభ్యులు జూన్ లో తొలిసారి సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంటు ఆవరణలో సుందరీకరణ పనుల్లో భాగంగా అక్కడున్నటువంటి మహాత్మాగాంధీ, అంబేద్కర్, ఛత్రపతి సహా పలు పోరాటయోధుల కాంస్య విగ్రహాలను తొలగించినట్లు తెలుస్తోంది. వాటిని పాత పార్లమెంటు భవనంలోని గేట్ నెంబర్ 5 సమీపంలో ఉన్నటువంటి పార్కులో ఉంచినట్లు సమాచారం.
Also Read: రాహుల్ జీ.. మీరే ఆ పదవిని చేపట్టాలి: కూటమి నేతలు
కాగా, దేశవ్యాప్తంగా ఏడు దశల్లో పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదలయ్యాయి. ఎన్డీఏ కూటమి అధిక స్థానాలను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఇండియా కూటమి కూడా ఊహించని విధంగా అధిక సీట్లను సాధించింది. అయితే, ఇటు ఇండియా కూటమి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అందుకోసం ఇతర పార్టీల ఎంపీల మద్దతును కోరుతున్నది. ఈ నేపథ్యంలో కొంత ఆసక్తిగా పరిస్థితి నెలకొన్నది. ఏ కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నదో అంటూ దేశవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.