Richa Chadha Controversial Statements : బాలీవుడ్ నటి రిచా చద్దా వివాదంలో చిక్కుకున్నారు. గల్వాన్ ఘటనపై ఆమె చేసిన ట్వీటే ఇప్పుడు కాంట్రవర్సీలో పడేసింది. రిచా చద్దా చేసిన ట్వీట్ పై పొలిటికల్ పార్టీతో పాటు నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. భారత్ జవాన్ల శౌర్య, పరాక్రమాలను అవమానించేలా రిచా చద్దా పోస్ట్ ఉందని మండిపడుతున్నారు. ట్వీట్ పై బాగా ట్రోల్ కావడంతో సారీ అంటూ క్షమాపణ కోరారు రిచా చద్దా. ఎవర్నీ బాధించాలన్నది నా ఉద్దేశం కాదని వివరణ ఇచ్చారు. వివాదానికి కారణమైన పాత ట్వీట్ను తొలగించారు.
అసలు రిచా చద్దా విమర్శలకు కారణం ఏంటంటే..పాకిస్థాన్ ఆక్రమించిన పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకునే విషయంలో భారత ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ఆదేశానికైనా సైన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నట్లు ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ను కోట్ చేస్తూ గల్వాన్ సేస్ హాయ్ అంటూ రిచా చద్దా రీట్వీట్ చేశారు. ట్వీట్లో ఆమె వాడిన గల్వాన్ పదం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. పీఓకేను టచ్ చేస్తే..గల్వాన్ ఘటన రిపీట్ అవుతుందనే ఉద్దేశంతో ట్వీట్ చేశారని నెటిజన్లు మండిపడుతున్నారు.
సైన్యాన్ని, భద్రతా బలగాలను భారతీయులు గౌరవిస్తారు. ఈ తరహా పోస్టులు చేసి, ఆర్మీని అవహేళన చేసేలా వ్యవహరించడం దురదృష్టకరం అని బీజేపీ నేతలు విమర్శించారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశ వ్యతిరేక పోస్టులు చేసే వారిపై నిషేధం విధించాలని శివసేన కూడా ఘాటుగా స్పందించింది. ఇలాంటి పోస్టులు అవమానకరమంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.