ippatam: ఛాన్స్ చిక్కితే చాలు పవన్ కల్యాణ్, చంద్రబాబులపై మాటలతో విరుచుకుపడుతున్నారు వైసీపీ నేతలు. పవన్ వర్సెస్ వైసీపీ వివాదం.. చెప్పులు చూపించుకోవడం వరకూ దారి తీసింది. ఆ రచ్చ ఇంకా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. లేటెస్ట్ గా, జనసేనానిపై ట్విట్టర్ లో ఫైర్ అయ్యారు కొడాలి నాని. ఇప్పటం కేసు విషయంలో సెటైరికల్ ట్వీట్ చేశారు.
“నీ గురువు చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదు.. నువ్వు ఎమ్మెల్యేగా గెలిచేది లేదు. ప్రశాంతంగా సినిమాలు చేసుకోక మిడిమిడి జ్ఞానంతో రాజకీయాలు చేయడం ఎందుకు పవన్ కళ్యాణ్”.. అంటూ ట్వీట్ చేశారు నాని. ట్వీట్ లో.. “ఇప్పటం పిటిషనర్లకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు జరిమానా విధించిన హైకోర్టు” అని కూడా ప్రస్తావించారు.
ఇప్పటంలో నోటీసులు ఇవ్వకుండా తమ ఇళ్లు కూల్చివేశారంటూ 14 మంది స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, నోటీసులు ఇచ్చాకే ఇళ్లు కూల్చివేశామంటూ అధికారులు కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం.. కోర్టు సమయం వృధా చేశారంటూ పిటిషనర్లకు ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు ఫైన్ వేసింది. ఇదే విషయంపై పవన్ ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు కొడాలి నాని.
ఇటీవల ఇప్పటంలో రోడ్డు వెడల్పు పేరుతో ఇళ్లు కూల్చివేయడంపై పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పటం వెళ్లి మరీ కూల్చివేతలను పరిశీలించారు. వైసీపీ సర్కారు తీరుపై మండిపడ్డారు. ఒక్కో ఇంటికి లక్ష ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించారు. ఈ నెల 27న పవన్ మరోసారి ఇప్పటం వెళ్లి బాధితులకు లక్ష రూపాయల చెక్కు ఇవ్వనున్నారు.