Mallareddy: వదల మల్లారెడ్డి నిన్నొదల.. అనేలా వెంటాడుతోంది ఐటీ శాఖ. ఏకంగా రెండున్నర రోజుల పాటు సోదాలు జరిపింది. 400 మంది సిబ్బంది, 65 బృందాలుగా తనిఖీలు చేసి మల్లారెడ్డి ఆదాయ గుట్టంతా బయటకు లాగింది. మంత్రి ఇంటితో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఇళ్ల నుంచి 15 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు ఐటీ శాఖ వెల్లడించింది. మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, పీజీ సీట్లలో అక్రమాలకు పాల్పడ్డారని.. సుమారు 135 కోట్లు డొనేషన్ల కింద వసూలు చేసినట్టు ఐటీశాఖ తెలిపింది. మరింత సమగ్ర విచారణ కోసం ఈనెల 28, 29 తేదీల్లో హాజరై వివరణ ఇవ్వాలని మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబసభ్యులు, బందువులకు ఐటీ శాఖ సమన్లు జారీ చేసింది.
మల్లారెడ్డి వ్యాపార సామ్రాజ్యంపై ఐటీ పంజా విసిరింది. మెడికల్, డెంటల్, ఫార్మసీ, ఇంజినీరింగ్ కాలేజీలు, ఆసుపత్రులు, రియల్ ఎస్టేట్.. తదితర ఆస్తులపై మల్లారెడ్డి సంస్థలకు చెందిన కార్యాలయాలు, సీఈవోలు, డైరెక్టర్లు, మల్లారెడ్డి కుమారులు, అల్లుడు, బంధువులు, స్నేహితుల ఇళ్లతో పాటు క్రాంతి బ్యాంకు ఛైర్మన్ ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహించినట్టు ఐటీ శాఖ స్పష్టం చేసింది. మల్లారెడ్డికి చెందిన అన్ని కళాశాలల్లో ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేసినట్టు ఆధారాలు లభించాయని వెల్లడించింది.
అయితే, మంత్రి మల్లారెడ్డి వాదన మరోలా ఉంది. తన కుమారుల ఇళ్లలో కేవలం రూ.28లక్షలు మాత్రమే దొరికాయని అన్నారు. 100 కోట్ల డొనేషన్లు తీసుకున్నట్టు తమ నుంచి బలవంతంగా సంతకం చేయించుకున్నారని.. లేని డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చేదంటూ తనదైన స్టైల్ లో చెప్పుకొచ్చారు.
ఐటీ అధికారులు దౌర్జన్యం చేసి సంతకాలు చేయించుకున్నారంటూ మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విధుల్లో ఉన్న ఉద్యోగులను అడ్డుకున్నారని, ల్యాప్ టాప్, సెల్ ఫోన్ లాక్కున్నారంటూ మల్లారెడ్డిపై ఐటీ సిబ్బంది సైతం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. రెండు ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. మల్లారెడ్డిపై సెక్షన్ 342, 353, 201, 203, 504, 506, 379, రెడ్విత్ 34 IPC కింద కేసు నమోదు చేయగా.. ఐటీ అధికారి రత్నాకర్పై 384 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
ఇక, కీలకమైన బ్యాంక్ లాకర్లనూ తెరవాల్సి ఉంది. ఆయా లాకర్ల కీస్ ప్రస్తుతం ఐటీ శాఖ దగ్గరే ఉన్నాయి. వాటిని తెరిస్తే.. మరింత గుట్టు రట్టవుతుందని భావిస్తున్నారు. తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న అనేక డాక్యుమెంట్లు, నగదు, హార్డ్ డిస్క్ లను బషీర్బాగ్లోని ఐటీ కార్యాలయానికి తరలించారు. మల్లారెడ్డి అన్నట్టుగానే.. మిగతా సినిమా అయకార్ భవన్ కు మారింది.