YCP vs TDP: 175కి 175. జగన్ టార్గెట్ స్కోర్ ఇది. కుప్పం నీదా నాదా సై..అంటున్నారు. చంద్రబాబునూ ఓడిస్తామంటూ సవాల్ చేసున్నారు. టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు అంటూ సమరానికి సై అంటున్నారు. వైసీపీ జోరు.. యమ స్పీడుగా ఉంది. గెలుపే లక్ష్యంగా పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలను, 8 జిల్లాల అధ్యక్షులను మార్చేశారు జగన్.
టీడీపీ సైతం తగ్గేదేలే అంటోంది. పులివెందులలో జగన్ ఓడిపోతారంటూ చంద్రబాబు జోస్యం చెబుతున్నారు. వైసీపీకి 175 స్థానాల్లోనూ గుండు సున్నా తప్పదని తేల్చి చెబుతున్నారు. అందుకు తన కర్నూలు పర్యటనే నిదర్శనమని సాక్షాలు చూపుతున్నారు. సీమలో తన ఆదరణ చూసే పార్టీ అధ్యక్షులను జగన్ మార్చేశారంటూ కవ్విస్తున్నారు. ఇవే చివరి ఎన్నికలంటూ 40 ఇయర్స్ ఎక్స్ పీరియెన్స్ రంగరించి మరీ సెంటిమెంటునూ రాజేస్తున్నారు చంద్రబాబు.
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ పొలిటికల్ వార్ మామూలుగా లేదు. కుప్పంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు జగన్. ఇప్పటికే ఎమ్మెల్సీ భరత్ ను కుప్పం వైసీపీ అభ్యర్థిగా ప్రకటించేసి.. ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని బహిరంగంగా చెప్పేసి.. చంద్రబాబు మీదకు గెలుపు గుర్రాన్ని వదిలారు జగన్. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంను కైవసం చేసుకొని.. నిధుల వరద పారిస్తూ.. ఏకంగా టీడీపీ అధినేతనే డిఫెన్స్ లో పడేసింది వైసీపీ. ఈసారి చంద్రబాబు ఓటమి ఖాయమంటూ తెగ ప్రచారం చేస్తున్నారు. 175కు 175 వైసీపీవే అంటూ విక్టరీ స్లోగన్ వినిపిస్తున్నారు.
కౌంటర్ గా చంద్రబాబు సైతం అదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. వైసీపీకి 175లో 175 ఓడిపోతుందని.. ఆ పార్టీకి గుండు సున్నా తప్పదంటూ రివర్స్ మైండ్ గేమ్ ఆడుతున్నారు చంద్రబాబు. పులివెందులలోనూ ఈసారి జగన్ గెలిచే ప్రసక్తి లేదంటూ కుప్పంకు విరుగుడు మంత్రం జపిస్తున్నారు. కర్నూలు పర్యటన ఇచ్చిన జోష్ తో.. మిగతా జిల్లాలన్నిటినీ చుట్టేసేందుకు సిద్ధమవుతున్నారు.
మరోవైపు, చంద్రబాబు అన్నట్టుగానే జగన్ కు కర్నూలు షాక్ గట్టిగానే తగిలినట్టుంది. ఆ జిల్లాలో చంద్రబాబు ర్యాలీలకు వచ్చిన జనాన్ని చూసి టీడీపీ వాళ్లే అవాక్కవుతున్నారు. అలర్ట్ అయిన జగన్.. వెంటనే వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తలను మార్చేశారు. సజ్జల, బుగ్గన లాంటి సీనియర్లను తొలగించి.. కర్నూలు, నంద్యాల జిల్లాల బాధ్యతలను వైసీపీ జడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి అప్పగించారు. ఇదంతా చంద్రబాబు టూర్ ఎఫెక్టే అంటున్నారు.
ఇక, గెలుపే లక్ష్యంగా పార్టీ ప్రక్షాళనకు పూనుకున్నారు జగన్. ప్రాంతీయ సమన్వయ కర్తలుగా ఉన్న సజ్జల, బుగ్గన, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ లపై వేటు వేశారు. కడప, తిరుపతి, నెల్లూరులను బాలినేనికి కట్టబెట్టారు. పల్నాడు బాధ్యతల నుంచి కొడాలిని తప్పించి.. భూమనకు ఇచ్చారు. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తగా మర్రి రాజశేఖర్ తో పాటు ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డికి ఉమ్మడిగా బాధ్యతలు అప్పగించారు. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ప్రాధాన్యతలను అలానే ఉంచేశారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి బిగ్ ప్రమోషన్ లభించింది. వైసీపీ రాష్ట్ర సమన్వయకర్తగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డికి సహాయకారిగా చెవిరెడ్డిని నియమించారు జగన్. 8 జిల్లాల్లో పార్టీ అధ్యక్షులను మార్చేశారు.
ఇలా వైసీపీ, టీడీపీ ధీటైన వ్యూహాలతో 175 సీట్లను టార్గెట్ చేస్తూ పొలిటికల్ మైండ్ గేమ్ అడుతున్నాయి రెండు పార్టీలు.