FarmHouse Case: వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు. టెక్నికల్ గా వైసీపీ ఎంపీనే అయినా.. ఆయన రెబెల్ లీడర్. ఏపీ ప్రభుత్వం పదే పదే టార్గెట్ చేస్తున్న పార్లమెంట్ సభ్యుడు. ఆయనపై అనర్హత వేటు వేయాలని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. ఇప్పటివరకైతే ఎలాంటి యాక్షన్ లేదు. బీజేపీతో సన్నిహితంగా ఉండటం వల్లే రఘురామను కేంద్రం కాపు కాస్తోందని అంటారు. బీజేపీ పెద్దలను తరుచూ కలుస్తూ ఉండటం.. అప్పట్లో బీజేపీపై స్పెషల్ సాంగ్ కూడా రిలీజ్ చేయడం చూస్తుంటే.. ఆయన కమలం పార్టీ అనధికార సభ్యుడనే అనుమానం.
కట్ చేస్తే.. ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఎంపీ రఘురామకు 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చింది సిట్. ఈ నెల 29న విచారణకు రావాలని సూచించింది. అదేంటి, ఫాంహౌజ్ కేసులో రఘురామకు సంబంధం ఏంటి? అని అంతా ఉలిక్కిపడుతున్నారు. అయితే, లింక్ ఉందని అంటోంది సిట్. దర్యాప్తులో రఘురామకు సంబంధించిన కీలక విషయాలు సేకరించామని అందుకే ఆయనను విచారణకు పిలిచామని సిట్ చెబుతోంది.
ఫాంహౌజ్ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచీ ముగ్గురు నిందితుల ఫోటోలో ఫుల్ వైరల్ గా మారాయి. వివిధ సందర్భాల్లో ఆ ముగ్గురు.. వివిధ ప్రముఖులతో ఉన్న పిక్స్ కనిపించాయి. వాటిలో.. నందకుమార్, రామచంద్ర భారతిలతో రఘురామ కృష్ణరాజు కలిసి ఉన్న వేరు వేరు ఫోటోలు కూడా ఉన్నాయి. అంటే, వారిద్దరితో రాజుకు మంచి సంబంధాలే ఉన్నాయని ఓ అంచనా.
పార్టీలు ఆర్థిక వ్యవహారాలను డీల్ చేసే విధానం వేరేలా ఉంటుంది. నేరుగా పార్టీ ఖాతా నుంచి డబ్బులు ఖర్చు చేయరు. సంపన్నులైన తమ వారితో ఆ పనులు చేయిస్తుంటారు. ఇక, రఘురామ కృష్ణరాజు ఆర్థికంగా అత్యంత ధనవంతుడు. అలా చూస్తే.. ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఒక్కో ఎమ్మెల్యేకు 100 కోట్లు చొప్పున డీల్ జరిగిందని తెలుస్తోంది. అంటే, మొత్తంగా 400 కోట్లు. ఆ మొత్తంలో ఎంతో కొంత రఘురామతో అడ్జస్ట్ చేయాలని చూశారా?. సిట్ విచారణలో ఆ ముగ్గురిని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయనే కోణంలో ప్రశ్నిస్తే.. రఘురామ పేరు బయటకు వచ్చిందని అంతర్గత వర్గాల సమాచారం. ప్రస్తుతానికైతే ఇది ఆఫ్ ది రికార్డ్ మేటర్. అసలు సంగతి సిట్ విచారణలో తేలుతుంది.
అసలే రఘురామపై ఏపీలో వైసీపీ సర్కారు పీకలదాకా కోపంతో ఉంది. ఓ సారి సీఐడీ టార్చర్ రుచి చూసిన చేదు అనుభవం కూడా ఉంది. అప్పటి నుంచీ ఏపీలో అడుగుకూడా పెట్టలేకపోతున్నారు ఎంపీ. ఢిల్లీలోనే ఉంటూ.. అప్పుడప్పుడు హైదరాబాద్ ఇంటికి వచ్చి పోతున్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణ సర్కారునూ ఇబ్బందికి గురి చేస్తేలా.. ఫాంహౌజ్ కేసులో రఘురామ పేరు రావడం.. ఆయనకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఇలా, రెండు తెలుగు రాష్ట్రాలకూ గిట్టని వాడుగా మారాడు రఘురామ.