Tamil Nadu CM MK Stalin: తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు అందరి దృష్టి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుపైనే ఉంది. ఎన్డేఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ అనూహ్య పరిస్థితులు ఎదురైతే ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు లేకపోలేదనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఈ అంశంపై తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ను మీడియా వివరణ అడిగింది. ఒకవేళ ఇండియా కూటమికి కేంద్రంలో అధికారం ఏర్పాటు చేసేందుకు అవకాశం లభిస్తే ప్రధాని అభ్యర్థి రేసులో మీరు ఉంటారా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. ఇందుకు ఆయన ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. తన తండ్రి కరుణానిధి డైలాగ్ ను ప్రస్తావిస్తూ మీడియా ప్రతినిధికి సమాధానం ఇచ్చారు.
‘నా ఎత్తు ఎంతో నాకు తెలుసు.. ఈ విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు చెప్పా’ అంటూ స్టాలిన్ పేర్కొన్నారు. అనంతరం ఎన్నికల ఫలితాలపై మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో తమిళనాడు, పుదుచ్చేరిలో తమ కూటమికి 39 స్థానాలు వచ్చాయని, ఈసారి మాత్రం 40కి 40 సాధించగలిగామన్నారు. ఈ విజయాన్ని తన తండ్రి కరుణానిధికి అంకితమిస్తున్నానంటూ స్టాలిన్ తెలిపారు. చాలా రాష్ట్రాల్లోనూ మోదీ వ్యతిరేక గాలి వీచిందంటూ ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా బుధవారం సాయంత్రం జరగబోయే ఇండియా కూటమి పార్టీల సమావేశంలో తాను పాల్గొననున్నట్లు తెలిపారు.
Aslo Read: బీజేపీ కుటిల రాజకీయాలు, డిప్యూటీ సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా, కాకపోతే..
గతంలో కరుణానిధి ‘ఎత్తు’ వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిన విషయం తెలిసిందే. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కరుణానిధి 13 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ, కేంద్రంలో పాలన జోలికి వెళ్లకుండా రాష్ట్ర రాజకీయాలకు మాత్రమే ఆయన పరిమితమయ్యారు. అయితే, 1997లో దేవెగౌడ ప్రభుత్వం పడిపోయాక కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ నేషనల్ ఫ్రంట్ లోని కొంతమంది నేతలు కరుణానిధిని కోరగా, ఆయన స్పందిస్తూ ‘నా ఎత్తు ఎంతో నాకు తెలుసు’ అంటూ కరుణానిధి నాటి ఆఫర్ ను తిరస్కరించినట్లు అప్పట్లో వార్తా కథనాలు వెలువడ్డాయి.