NDA Meeting in Delhi : దేశరాజధాని ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఎన్డీయే కూటమి నేతల సమావేశం ముగిసింది. కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు నరేంద్రమోదీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ నేతలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, నితీష్ కుమార్, చిరాగ్ పాశ్వాన్, అనుప్రియ పాటిల్, సీఎం ఏక్ నాథ్ షిండే, జితిన్ రామ్ మంఝి, జయంత్ చౌదరి తదితరులు హాజరయ్యారు.
సుమారు గంటన్నరకు పైగా జరిగిన సమావేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించారు. చంద్రబాబు, నితీష్ కుమార్, శివసేన షిండే వర్గం లేఖలు సమర్పించాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. నరేంద్రమోదీ, నడ్డా, రాజ్ నాథ్ సహా.. సమావేశానికి హాజరైన నేతలంతా ద్రౌపది ముర్మును కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని కోరనున్నారు. మరోవైపు ఇండియా కూటమి నేతలు.. ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారని.. చంద్రబాబు నాయుడు తమ కూటమిలోకి వస్తారని ఉద్ధవ్ థాకరే చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.
Also Read : 40 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ రికార్డ్.. బీజేపీకి తగ్గిన ఓట్ షేర్
దేశంలో 543 లోక్ సభ స్థానాలుండగా.. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 272 సీట్లు కావాల్సి ఉంటుంది. బీజేపీ 240 స్థానాల్లో నెగగ్గా.. మిత్రపక్షాలతో కలుపుకుని ఎన్డీయే 292 సీట్లలో విజయం సాధించింది. కాంగ్రెస్, మిత్రపక్షాలు 200 స్థానాల్లో విజయం సాధించాయి. బీజేపీకి మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలు కాంగ్రెస్ తో జతకడితే కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. మోదీ వెంటే ఉంటే.. మరోసారి ప్రధానిగా మోదీ జూన్ 8న ప్రమాణ స్వీకారం చేస్తారు. మరి ఈసారి కేంద్రంలో ఏ ప్రభుత్వం వస్తుందో తెలియాలంటే.. కొంత సమయం వేచిచూడక తప్పదు.