TG High Court Issued Notices to higher Officials : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసును హైకోర్టు సుమోటోగా తీసుకుంది. న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. దీనిని జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా పరిగణించాలని పేర్కొంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించాలని తెలిపింది. మీడియాలో వచ్చిన వివిధ కథనాలను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం.. దానిపై విచారణ చేపట్టింది.
ఫోన్ ట్యాపింగ్ కేసుపై పూర్తి వివరాలతో నాలుగు రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని.. చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 3 తేదీకి వాయిదా వేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బిగ్ టీవీలో ప్రత్యేక కథనాలు ప్రసారమయ్యాయి. హైకోర్టు న్యాయమూర్తులతో పాటు రాజకీయ నేతలు, వ్యాపారస్థుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు బిగ్ టీవీలో వరుస కథనాలు ప్రసారమయ్యాయి.
Also Read : ఫోన్ ట్యాపింగ్పై సెంట్రల్ దృష్టి, డీటేల్స్ కావాలంటూ…
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపింది. ప్రణీత్ రావు, ప్రభాకర్, భుజంగరావు, రాధాకిషన్ రావులు ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. 2018 నుంచి రాష్ట్రంలో అందరు అధికారులు, నేతల ఫోన్లను ట్యాప్ చేసిన డేటాను.. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మాయం చేశారు. హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేసి.. నాలాల్లో పడేసినట్లు చెప్పారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వెనుకంతా ఉన్నది గులాబీ బాసేనన్న నిజాన్ని బట్టబయలు చేశారు.