AP Highcourt : నెల్లూరు కోర్టులో జరిగిన చోరీ కేసుపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.కె.మిశ్రా ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో రాష్ట్ర పోలీసుల దర్యాప్తు సరైన దిశలో జరగడం లేదని, స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన నివేదికను హైకోర్టు సుమోటో పిల్గా పరిగణించి విచారణ చేపట్టింది. కేసును సీబీఐకి అప్పగించినా అభ్యంతరం లేదని అడ్వకేట్ జనరల్ గతంలో హైకోర్టుకు తెలిపారు.
నెల్లూరు కోర్టులో జరిగిన చోరి విషయంలో అప్పట్లో సీబీఐ డైరెక్టర్, డీజీపీ, మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ కేసు విచారణ మళ్లీ చేపట్టిన హైకోర్టు చోరీ కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది. ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్న ఫోర్జరీ, మోసం, తప్పుడు పత్రాల సృష్టి కేసుకు సంబంధించిన ఆధారాలు నెల్లూరు నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నుంచి చోరీకి గురయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది.
కాకాణిపై విచారణ కీలకదశకు చేరుకున్న సమయంలో ఆ కేసుకు సంబంధించిన ముఖ్యమైన దస్త్రాలు, పత్రాలు, ఆధారాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు న్యాయస్థానం నుంచే చోరీ కావటం రాష్ట్రంలో సంచలనం రేపింది. మంత్రి నిందితుడిగా ఉన్న కేసులో కీలకపత్రాలు, ఆధారాలను న్యాయస్థానంలో తాళాలు పగలకొట్టి మరీ దొంగలు ఎత్తుకుపోయారు. చోరీకి గురైన కొన్ని పత్రాలు సమీపంలోని కాలువలో లభించాయి. ఇప్పుడు ఈ కేసును సీబీఐకి అప్పగించింది హైకోర్టు.
నెల్లూరు కోర్టులో జరిగిన చోరీ కేసును సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. హైకోర్టు న్యాయమూర్తుల పర్యవేక్షణలో విచారణ జరగాలని స్పష్టం చేశారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని సీఎం జగన్ వెంటనే కేబినెట్ నుంచి తొలగించాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.