AP Secretariat Checking By Police(AP latest news): ఏపీ సచివాలయంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సచివాలయంలోని ఐటీ విభాగంలో పోలీసు అధికారులు తనిఖీలు చేశారు. ఐటీ కమ్యూనికేషన్ విభాగంలో ఉద్యోగుల కంప్యూటర్లు, ల్యాప్టాప్లతో పాటు వివిధ పరికరాలను తనిఖీ చేశారు.
ఐటీ విభాగంలోని కంప్యూటర్ల నుంచి డేటా చోరీతో పాటు, డేటా డిలేట్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఎం ఆఫీస్కు చెందిన పలు ఫైళ్లు ఈ- ఆఫీస్ నుంచి మాయం చేస్తున్నారని డీజీపీకి ఫిర్యాదు రావడంతో వెంటనే సైబర్ క్రైమ్తో పాటు ఇతర పోలీస్ టీం రంగంలోకి దిగింది. వారం రోజుల నుంచి జరిగిన ఫైళ్ల మూవ్ మెంట్ పై పోలీసులు ఆరా తీసారు.
మంత్రులు, సలహాదారుల పేషీల నుంచి నేమ్ బోర్డులను జీఏడీ సిబ్బంది రిమూవ్ చేశారు. పేషీల్లో ఫర్నీచర్, కంప్యూటర్ల వివరాలను నోట్ చేసుకుని లెక్కలను సరిపోల్చుకుంటున్నారు.
Also Read: కేఏపాల్ కొత్త పలుకులు, జగన్, పవన్ ఇంకా షాక్లోనే
ఇదిలా ఉంటే.. అధికారులు కొన్ని శాఖల ఫైళ్లను కూడా చించి వేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అధికారులు ఐటీ శాఖలో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అనంతరం అక్కడ ఉన్న పలువురు అధికారుల నుంచి పెన్ డ్రైవ్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పుల నుంచి కాపాడుకునేందుకే ఫైళ్లను చింపివేయడంతో పాటు, మాయం చేస్తున్నారని కూటమి శ్రేణులు ఆరోపిస్తున్నారు. వైసీపీ చేసిన తప్పులు బయటపడతాయనే ఉద్దేశ్యంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు.
కాగా.. రెవెన్యూ శాఖ కీలకమైన డాక్యుమెంట్లను ప్రాసెస్ చేయవద్దని ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఆదేశాలు జారీ చేశారు. మంత్రి పేషీలోని రికార్డులు, దస్త్రాలను జాగ్రత్తగా ఉంచాలని సిబ్బందికి సూచనలు చేశారు. బదిలీలు, సెలవులపై కూడా నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు.