IT Raids : తమ ఇళ్లు, సంస్థలు, కార్యాలయాల్లో ఐటీ దాడులపై మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. టర్కీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న తర్వాత ఐటీ దాడులపై మర్రి రాజశేఖర్ రెడ్డి స్పందించారు. తమ ఇంట్లో ఎలక్ట్రానిక్ లాకర్లు లేవని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఐటీ అధికారులు తమ కుటుంబ సభ్యులందరినీ ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. రాజకీయ కక్షలతో పథకం ప్రకారమే దాడులు చేశారని మర్రి రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు.
మల్లారెడ్డిపై కేసులు
మరోవైపు మంత్రి మల్లారెడ్డిపై ఐటీ అధికారులు బోయిన్ పల్లి పీఎస్లో బుధవారం రాత్రి ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రిపై 342, 353, 201, 203, 504, 506, 353, 379 r/w 34ipc సెక్షన్ల కింద బోయిన్ పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీ అధికారులు సోదాల్లో సేకరించిన డాక్యుమెంట్లు, పంచనామా, సెల్ఫోన్స్, ల్యాప్టాప్ లాక్కున్నారని ఫిర్యాదులో ఐటీ అధికారులు పేర్కొన్నారు. డ్యూటీలో ఉన్న ఐటీ అధికారుల విధులకు మంత్రి మల్లారెడ్డి ఆటంకం కలిగించారని అభియోగాలు నమోదయ్యాయి.
ఐటీ అధికారులపై ఫిర్యాదు
అటు ఐటీ అధికారులపై మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపై ఐటీ అధికారులు దౌర్జన్యం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఐటీ అధికారులపై 384 సెక్షన్ కింద కేసు నమోదైంది.