CM Revanth Reddy: ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వంతో సామరస్యంగానే ముందుకు వెళ్లి రాష్ట్ర సమస్యలు పరిష్కరించుకుంటామని చెప్పారు. ఈ విషయాన్ని గతంలో కూడా చెప్పానంటూ ఆయన గుర్తుచేశారు.
అదేవిధంగా ఏపీ ప్రత్యేక హోదా అనే అంశం చట్టబద్ధతతో కూడుకున్న హామీ అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు రాహుల్ గాంధీ కట్టుబడి ఉన్నారని ఆయన అన్నారు. ఈ అంశంపై తమ పార్టీలో చర్చించిన తరువాత చంద్రబాబుతో మాట్లాడుతానంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా ఏపీలో త్వరలో జరగబోయే ప్రమాణస్వీకారోత్సవానికి చంద్రబాబు పిలిస్తే తప్పకుండా వెళ్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
ఇదిలా ఉంటే ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్కు సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ సామరస్యంగా ముందుకువెళ్తామంటూ సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే.
అయితే, ఏపీలో మే 13న అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. జూన్ 4న ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో కూటమి అధిక సీట్లను కైవసం చేసుకుంది. ఇటు వైసీపీ కేవలం 11 సీట్లలో మాత్రమే గెలిచింది. కనీసం ప్రతిపక్ష హోదా వచ్చేందుకు కావాల్సిన సీట్లలో కూడా గెలవలేకపోయింది. ఊహించని విధంగా కూటమి అధిక సీట్లు గెలుచుకుంది. దీంతో కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్కు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Also Read: బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ బలిదానం.. ప్రెస్ మీట్లో సీఎం రేవంత్ రెడ్డి
ఇటు ఎన్డీఏ కూటమిలో కూడా టీడీపీ, జనసేన పార్టీలు కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్కు ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేతలు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో ఓ పదవిని కూడా ఆఫర్ చేయగా, చంద్రబాబు ఆలోచించి చెబుతానంటూ పేర్కొన్న విషయం తెలిసిందే.