ట్విట్టర్, మెటా, అమెజాన్, గూగుల్, సిస్కో… ఇప్పుడు హెచ్పీ. ఉద్యోగుల్ని తొలగిస్తున్న కంపెనీల జాబితాలో పూటకో కంపెనీ చేరుతోంది. తాజాగా హ్యూలెట్-ప్యాకర్డ్ సంస్థ కూడా 6 వేల మంది ఉద్యోగుల్ని తొలగించబోతున్నట్లు ప్రకటించింది. కాకపోతే ఒకేసారి కాకుండా… వచ్చే రెండేళ్లలో దశల వారీగా ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపుతామని ప్రకటించింది.
అమెరికాలో బడా కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తున్న తీరు… ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా హ్యూలెట్-ప్యాకర్డ్ కంపెనీతో కలిపి… ఇప్పటివరకు ప్రముఖ సంస్థలన్నీ 53 వేల మంది ఉద్యోగుల్ని పైగా తీసేశాయి. వాటిలో ట్విట్టర్ 10 వేలు, మెటా 13 వేలు, అమెజాన్ 10 వేలు, గూగుల్ 10 వేలు, సిస్కో 4 వేలు, హెచ్పీ 6 వేల మందికి ఉద్వాసన పలికాయి.
కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ప్రింటర్లు తయారు చేసే హెచ్పీ… ఇప్పుడు వాటికి గిరాకీ తగ్గడంతో… ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. కరోనా సమయంలో ఆన్ లైన్ క్లాసులు, వర్క్ ఫ్రమ్ హోమ్, వర్చువల్ సమావేశాల కారణంగా కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ప్రింటర్లకు రికార్డు స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. దానికి తగ్గట్టు ఉత్పత్తి పెంచడానికి ఆయా సంస్థలు భారీగా ఉద్యోగుల సంఖ్యను పెంచుకున్నాయి. కానీ కరోనా తర్వాత పరిస్థితులు క్రమంగా తిరిగి సాధారణ స్థాయికి చేరడంతో… కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ప్రింటర్లకు గిరాకీ తగ్గింది. దానికి తోడు ఆర్థిక మాంద్యం కారణంగా అనేక వ్యాపార సంస్థలు, కుటుంబాలు ఖర్చులు తగ్గించుకునే ప్రణాళికలో భాగంగా కొనుగోళ్లను వాయిదా వేస్తుండటంతో… ఎలక్ట్రానికి ఉత్పత్తులకు డిమాండ్ భారీగా పడిపోయింది. అందుకే డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగుల సంఖ్యను క్రమబద్ధీకరించుకోవాలని హెచ్పీ భావిస్తోంది. ప్రస్తుతం ఆ కంపెనీలో దాదాపు 50 వేల మంది పనిచేస్తున్నారు. మొత్తం ఉద్యోగుల్లో 12 శాతం లేదా 4 నుంచి 6 వేల మంది ఉద్యోగులను తగ్గించుకోవాలని హెచ్పీ భావిస్తోంది. ఈ ఏడాది మాదిరే 2023లోనూ సవాళ్లు ఎదురుకావొచ్చని, వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అనుకున్న దానికంటే తక్కువ లాభాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్పీ అంచనా వేస్తోంది.