India vs Ireland Rohit Sharma Says 140-150 Could be a Good Score: అమెరికాలోని పిచ్ లు స్లో గా ఉన్నాయి. ఇక్కడ 140 నుంచి 150 పరుగులు చేయడమే గొప్ప అని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అనడంపై నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ మాత్రం దానికి అమెరికా వెళ్లడం ఎందుకు? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే రోహిత్ శర్మ ముందుగా జనాన్ని ట్యూన్ చేస్తున్నాడని కొందరు అంటున్నారు.
పిచ్ లు ఎలా ఉన్నా, క్రికెటర్ అన్నవాడు ఆడాల్సిందేనని గట్టిగా వాదించే రోహిత్ శర్మ ఇలా మాట్లాడటంపై నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో ఓటమిపై మాట్లాడుతూ.. పిచ్ కారణంగా ఓడిపోయామంటే.. ఒప్పుకోనని అన్నాడు. ఎందుకంటే మేం ఆడలేకే ఓడిపోయామని నిజాయితీగా ఒప్పుకున్నాడు. అంతేకాదు ఇంటర్నేషనల్ ప్లేయర్ అన్నవాడు ఏ పిచ్ మీదైనా ఆడాలి. లేదంటే గల్లీ మ్యాచ్ లు ఆడుకోవాలని అన్నాడు.
తర్వాత సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లినప్పుడు కూడా రెండో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా పిచ్ పై తీవ్ర చర్చ జరిగింది. దానిపై కూడా స్పందించాడు. ప్రపంచ మీడియాను విమర్శించాడు. ఇది రచ్చరచ్చ అయ్యింది. తర్వాత నుంచి తను అదే మాట మీద స్టిక్ ఆన్ అయి ఉన్నాడు.
కానీ ఇప్పుడు టీ 20 ప్రపంచకప్ లో మాత్రం ఇక్కడ పిచ్ లు స్లో గా ఉన్నాయని చెప్పడమే కాదు, వీటిపైన 150 పరుగులు చేస్తే గొప్పే అన్నాడు. వాటిని కాపాడుకోవచ్చునని అన్నాడు. ఇదే ఇప్పుడు నెట్టింట రచ్చగా మారింది. ఆరోజు ఆ మాట.. ఈ రోజు ఈ మాట ఏమిటి బ్రో.. అంటూ సెటైర్లు వేస్తున్నారు.
Also Read: ఫలితం తేలని ఇంగ్లండ్- స్కాట్లాండ్ మ్యాచ్
ఇంకా రోహిత్ శర్మ మాట్లాడుతూ పిచ్లు నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో బ్యాటర్లు ఆచితూచి ఆడాలి. పరుగుల కోసం దూకుడుగా వెళ్లకూడదని అన్నాడు.
ఈ నేపథ్యంలో ఐర్లాండ్తో బరిలోకి దిగే టీమిండియా కాంబినేషన్పై రోహిత్ శర్మ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ‘టీమ్ కాంబినేషన్ ఎలా ఉంటుందో నాకు తెలీదని అన్నాడు. నలుగురు స్పిన్నర్లు కూడా ఆడవచ్చు.. బౌలింగ్ ఆప్షన్ ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. బంగ్లాదేశ్తో మ్యాచ్లో స్పిన్నర్లంతా రాణించారు. వారంతా రెండేసి ఓవర్లు బౌలింగ్ చేశారు ‘అని సమాధానమిచ్చాడు.
మెగా టోర్నీలో ఆటగాళ్లు, ప్రేక్షకుల భద్రతకు ముప్పు ఉందనే హెచ్చరికల నేపథ్యంలో ఆతిథ్య దేశం సెక్యూరిటీని పెంచిందని, వారి రూల్స్ను గౌరవించాలన్నాడు. లేదంటే వాళ్లు పెట్టే కఠిన నిబంధనలు.. ఆటపై ప్రభావం చూపిస్తాయని అన్నాడు.