Nitish kumar, Tejashwi yadav news(Live tv news telugu): బీహార్ సీఎం, జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ ఢిల్లీకి బయలుదేరారు. నేడు రాజధానిలో జరగనున్న ఎన్డీఏ సమావేశానికి అన్ని రాష్ట్రాల నేతలు ఇప్పటికే ప్రయాణమయ్యారు. అయితే బీహార్లో మాత్రం విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఎన్టీఏ సమావేశానికి నితీష్ కమార్ వెళ్తుండగా.. అదే విమానంలో ఇండియా కూటమి నిర్వహిస్తున్న సమావేశానికి ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ ప్రయాణించడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల లెక్కింపు పూర్తి కావడంతో అటు ఎన్డీఏ కూటమి, ఇటు ఇండియా కూటమి ప్రత్యేక సమావేశాలు కీలకంగా మారాయి.
క్లారిటీ ఇచ్చిన తేజస్వి..
ఢిల్లీకి బీహార్ సీఎం నితీష్ కుమార్, ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ ఒకే విమానంలో ప్రయాణించారు. అయితే ముందు వరుస సీట్లలో నితీష్ కుమార్ కూర్చోగా.. ఆ వెనుక సీటులోనే తేజస్వియాదవ్ కూర్చోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సమయంలో ఇద్దరు నేతలు పరస్పరం మాట్లాడుకున్నారని, ఎన్నికల ఫలితాలపై చర్చించారని ఊహించినా అలాంటిది ఏమి జరగలేదని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. అయితే ఈ పరిణామంతో ఎవరు ఎవరిని ఏ కూటమి వైపు తీసుకెళ్తారనే చర్చ జోరుగా సాగుతోంది. కాగా, ఈ విషయంపై జేడీయూ నేత కేసీ త్యాగి స్పందించారు. తాము ఎన్డీఏలో కొనసాగుతామని ఆయన స్పష్టం చేశారు. ఇక, తన ప్రయాణంపై ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ క్లారిటీ ఇచ్చారు. తాము ఇండియా కూటమి సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తున్నట్లు చెప్పడంతో అంతకుముందు కూటమిపై జరిగిన చర్చలకు ఫుల్ స్టాప్ పడింది.
Also Read: ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ విక్టరీ..ఎన్డీఏ ఎన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉందంటే?
కీలక సమావేశాలు.. ఉత్కంఠ
ఢిల్లీలో ఎన్డీఏ కూటమితోపాటు ఇండియా కూటమి కీలక సమావేశం జరగడంతో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఢిల్లీకి శరద్ పవార్, స్టాలిన్, ఉద్దవ్ ఠాక్రే బయలుదేరారు. అదే విధంగా ఈ భేటీలో బెంగాల్ దీదీ మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ అఖిలేష్ హాజరుకానున్నారు. వీరంతా ఎన్డీఏలోని పార్టీలతో చర్చిస్తున్నట్లు ఉహాగానాలు వస్తున్నాయి. ఆయా పార్టీలతో మాట్లాడిన తర్వాతనే సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇండియా కూటమి తన ప్రయత్నాలు చేస్తూనే.. నేడు ఢిల్లీలో సమావేశం నిర్వహిస్తోంది. ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ఎన్డీఏ కూటమిలోని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఢిల్లీకి బయలుదేరారు. మోదీ నివాసంలో జరిగే ఎన్డీఏ సమావేశంలో వీరు పాల్గొననున్నారు. అయితే ప్రత్యేక హోదా విషయంపై ఇండియా కూటమి నేతలు ప్రతిపాదించడంతో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా చంద్రబాబుకు స్వయంగా ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే చంద్రబాబు ఎన్డీఏ కన్వీనర్గా బాధ్యతలు చేపట్టాలని కోరినట్లు సమాచారం. ఈ సమావేశాల తర్వాత ప్రధాని ఎవరనే అంశాలపై పూర్తిస్థాయిలో స్పష్టత రానుంది.