Lok Sabha Election Results:సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో చివరి ఘట్టం ముగిసింది. విజయం ఎవరికి వరిస్తుందోననే ఉత్కంఠకు తెర పడింది. పోటాపోటీగా జరిగిన ఓట్ల లెక్కింపులో ఎన్డీఏకి స్పష్టమైన మెజార్టీ దక్కింది. ముచ్చటగా మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లను ఎన్డీఏ కూటమి సాధించింది. దీంతో మరోసారి అధికారం చేపట్టేందుకు సిద్ధమవుతోంది. కేంద్రంలో ఎన్డీఏ 292 స్థానాల్లో గెలుపొందగా.. ఇందులో 240 చోట్ల బీజేపీ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. ఒక ఇండియా కూటమి 234 స్థానాల్లో విజయం సాధించగా.. మరో 17 సీట్లల్లో ఇతర పార్టీలు గెలుపొందారు.
13 రాష్ట్రాల్లో బీజేపీ..
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి సత్తా చాటింది. ఈ ఎన్నికలతోపాటే నిర్వహించిన ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించింది. దీంతో దేశ వ్యాప్తంగా బీజేపీ అధికారం చేపట్టనున్న రాష్ట్రాల సంఖ్య 13కు చేరుకుంది. ఒడిశాలో మొత్తం 147 నియోజకవర్గాలున్నాయి ఇందులో బీజేపీ 78 సీట్లు గెలుచుకోగా.. బీజేడీ 51 స్థానాలు మాత్రము గెలవడంతొ ఈ రాష్ట్రంలో బీజేపీ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఇక అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ 46 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే.
Also Read: కేంద్రంలో మూడోసారి అధికారాన్ని చేపట్టబోతున్న ఎన్డీఏ.. మిగతా పార్టీలకు ఎన్ని సీట్లు వచ్చాయంటే..?
ఎన్డీఏ అధికారంలో ఉన్న రాష్ట్రాలివే..
ఉత్తరాఖండ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, గోవా, అస్సాం, త్రిపుర , మణిపూర్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండనుండగా.. మహారాష్ట్ర, మేఘాలయ, నాగాలాండ్, బీహార్, పుదుచ్చేరి, ఏపీతో కలిపి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే లోక్సభలో బీజేపీకి మెజార్టీ తక్కువగా రావడంతో ఎన్డీఏ మిత్రపక్షాల అవసరం ఉండనుంది. ఈ మేరకు కాసేపట్లో ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబుతోపాటు బీహార్ సీఎం, జేడీ(యూ) అధ్యక్షుడు నితీష్ కుమార్ హాజరుకానున్నారు. ఎన్డీఏ మిత్ర పక్షాల్లో టీడీపీ, జనసేనకు 18 స్థానాలు, జేడీయూకు 12 సీట్లు కీలకంగా మారాయి. దీంతో వీరిద్దరూ కింగ్ మేకర్స్ కానున్నారు.