Revanth Reddy congratulates Chandrababu and Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు అభినందనలు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను కొనసాగిస్తూ సమస్యలను పరిష్కరించుకుంటూ అభివృద్ధి పథం వైపు సాగుదామం’ అంటూ రేవంత్ రెడ్డి ఆ పోస్ట్ లో పేర్కొన్నారు.
కాగా, ఏపీలో మే 13న అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి జరిగాయి. ఆ ఎన్నికల ఫలితాలు నేడు విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. టీడీపీ వందకు పైగా అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. జనసేన 21 స్థానాల్లో గెలిచింది. ఇటు బీజేపీ కూడా 5 సీట్లకు పైగా తన సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ నేతలకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రధాని మోదీ, ఇటు పలువురు బీజేపీ అగ్రనేతలు కూడా చంద్రబాబుకు, పవన్ కల్యాణ్ కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
Also Read: ముఖ్యమంత్రి పదవికి జగన్ రాజీనామా..
తమ పార్టీ అత్యధిక సీట్లను కైవసం చేసుకోవడంతో టీడీపీ శ్రేణులు, జనసేన పార్టీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారు. టీడీపీ ఆఫీస్, చంద్రబాబు ఇంటికి భారీగా చేరుకుని బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు కూడా వారికి అభివాదం చేస్తూ కూటమి గెలుపునకు సహకరించినవారందరికీ ధన్యవాదాలు అంటూ ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా కూటమి ఘన విజయం సాధించడంతో చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో కేక్ కట్ చేశారు. ఇటు పవన్ కల్యాణ్ కూడా జనసేన పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ఈ గెలుపుతో తమ భుజాలపై మరింత బాధ్యత పెరిగిందన్నారు.