Revanth Reddy: ప్రభుత్వం చేతగాని తనం వల్లే ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు ప్రాణాలు కోల్పోయాడని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. పోడు భూముల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అందుకే అటవీ శాఖ అధికారులు, పోడు రైతులకు మధ్య నిత్యం చిచ్చు రేగుతోందని.. ఇందులో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ హత్యకు గురికావడం బాధాకరం అన్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్యే అని.. ఘటనకు సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పోడు రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్ కుటుంబానికి రూ. 5 కోట్ల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
2018లో ఓట్ల కోసం పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు అన్ని ఎన్నికల ప్రచార సభల్లో ఇచ్చిన హామీలు అటకెక్కించారని రేవంత్ గుర్తు చేశారు. పోడు భూములకు పట్టాలిస్తామని అసెంబ్లీలో ప్రకటన చేసి మూడేండ్లయిందని అన్నారు. మంత్రి సత్యావతి రాథోడ్ చైర్ పర్సన్ గా ఒక కమిటీ నియమించి దాదాపు 14 నెలలు అవుతున్నా ఇంతవరకు అతీగతీ లేదని విమర్శించారు.
ఎనిమిదేళ్లుగా పోడు భూములపై హక్కులు కల్పిస్తామని లబ్ధిదారులను కేసీఆర్ ఊరిస్తూ వచ్చారన్నారు. అటవీ భూములను సేద్యం చేస్తున్నారని గిరిజనుల పైకి అధికారులను ఎగదోస్తు ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం నిర్వాకం వల్లే అధికారులకు, గిరిజనులకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులపై కేసులు పెట్టారని అన్నారు. కొంత మంది ప్రజాప్రతినిధులు సైతం అధికారులపై దాడులకు దిగారని రేవంత్ గుర్తు చేశారు.
ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఒక అటవీ అధికారి ప్రాణాలు కోల్పోవడంతో పాటు గొత్తికోయలు జైలుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. గొత్తికోయలు చేసింది ముమ్మాటికి తప్పేనని అందుకు వారిని శిక్షించాల్సిందేనని అన్నారు. కానీ, పోడు భూముల అంశంలో ప్రభుత్వ నిర్లక్ష్యం క్షమించరానిదని అన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి పోడు భూములకు పట్టాలిచ్చే కార్యాచరణ చేపట్టాలని రేవంత్ రెడ్డి లేఖలో డిమాండ్ చేశారు. పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజనులు, ఆదివాసీల జోలికి వెళ్లకుండా అధికారులకు ఆదేశాలివ్వాలని కోరారు. విధుల్లో ఉండే అధికారులకు భద్రత కల్పించాలన్నారు. యుద్ధప్రాతిపదికన పోడు భూములకు పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయాలని.. లేని పక్షంలో టీకాంగ్రెస్ తరపున ఉద్యమ కార్యచరన ప్రకటిస్తాం అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.