Farmhouse Case: ఫాంహౌజ్ కేసులో సిట్ కు అనుకూలంగా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీ బిగ్ లీడర్ బీఎల్ సంతోష్ ను ప్రశ్నించేందుకు మార్గం సుగుమం అవుతోంది. సంతోష్ కు నోటీసులపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు మరోసారి నోటీసులు ఇవ్వాలని సూచించింది. 41ఏ సీఆర్ఫీసీ కింద ఈ-మెయిల్ లో నోటీసులు పంపాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పు పరిశీలించిన తర్వాత హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.
ఉదయం, మధ్యాహ్నం రెండు దఫాలుగా హైకోర్టులో విచారణ జరిగింది. ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ నోటీసులపై ఉదయం హైకోర్టు విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఎక్కడని ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. బీఎల్ సంతోష్కు ఈనెల 16 నుంచి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించినట్లు అడ్వకేట్ జనరల్ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. ఢిల్లీ పోలీసుల సాయంతో బీజేపీ ఆఫీసులో నోటీసులు అందించినట్లు వివరించారు. బీఎల్ సంతోష్ సిట్ ముందుకు వస్తే అసలు వాస్తవాలు తెలుస్తాయని హైకోర్టుకు వివరించారు. సిట్ విచారణ పారదర్శకంగా జరుగుతోందన్నారు.
సిట్ విచారణకు నిందితులు సహకరించడం లేదని అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో ఇంకా ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉందని ఏజీ అన్నారు. నిందితులు బయట ఉంటే సాక్ష్యాలను తారు మారు చేసే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు. ఏజీ వాదనలపై స్పందించిన ధర్మాసనం.. బీఎల్ సంతోష్ విచారణకు ఎందుకు హాజరుకావడం లేదని ప్రశ్నించింది.
బీఎల్ సంతోష్ చట్టాన్ని ఎక్కడా ధిక్కరించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది రామచంద్రరావు హైకోర్టుకు తెలిపారు. బీఎల్ సంతోష్ 41ఏ సీఆర్పీసీని సవాల్ చేయాలనుకుంటున్నారా? సిట్ ముందు హాజరయ్యేందుకు గడువు కోరుతున్నారా? అని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఇప్పటికే బీఎల్ సంతోష్ సిట్కు లేఖ రాశారని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. విచారణకు ఎందుకు హాజరు కాలేకపోతున్నారో లేఖలోనే చెప్పారని వివరించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. సుప్రీంకోర్టు ఉత్తర్వులు చూశాకే విచారణ జరుపుతామని ఉదయం వెల్లడించింది. దీంతో, మధ్యాహ్నం సుప్రీంకోర్టు తీర్పు కాపీని ధర్మాసనం ముందు ఉంచగా.. ఆ తీర్పు పరిశీలించిన తర్వాత సంతోష్ కు మరోసారి ఈ-మెయిల్ ద్వారా నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది.