Pawan Kalyan Reaction on AP Election Results : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి పార్టీలు విజయకేతనం ఎగురవేశాయి. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కూటమి విజయంపై, 21కి 21 స్థానాల్లో జనసేన విజయంపై స్పందించారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో మీడియాతో, జనసైనికులను, ఓటర్లను ఉద్దేశించి మాట్లాడిన పవన్ కల్యాణ్.. తన ప్రసంగంలో హుందా తనాన్ని ప్రదర్శించారు. పవన్ మాటల్లో గెలిచామన్న గర్వం ఏ కోశాన కనిపించలేదు. గెలుపు తమ భుజాలపై బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు.
“వైసీపీ పార్టీని భవిష్యత్తులో ఇబ్బంది పెట్టడానికి ఈ విజయం కాదు. 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుకు పునాది వేయడానికి వచ్చిన అవకాశం.జవాబుదారీతనంతో కూడిన రాజకీయ ప్రభుత్వం, ఆలోచనా విధానం ఉంటుంది. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాం. జగన్, వైసీపీ నాకు శత్రువులు కాదు. ఇది చారిత్రాత్మక రోజు, చారిత్రాత్మక విజయం. నా జీవితంలో ఇప్పటి వరకూ విజయం అంటే ఏమిటో తెలియదు. ఒకే ఒక్కసారి సినిమాల్లో తొలిప్రేమ విజయాన్ని చూశాను. ఆ తర్వాత విజయం సాధించానని, డబ్బులు వచ్చాయని ఏ ఒక్క సినిమా చెప్పలేదు. జీవితమంతా దెబ్బలు తింటూ, మాటలు పడుతూ ఎదుగుతూ వచ్చాను. 21కి 21 గెలిచేంతవరకూ నేనేంటో నాకే తెలియలేదు. ఇకపై ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాల్సి ఉంటుంది.”
“ఈ విజయం జనసేన, జనసైనికులు, వీరమహిళలది మాత్రమే కాదు. ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షది. మార్పు కావాలి. పాలన మారాలి. ఆలోచన నుంచి వచ్చిన విజయమిది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి బలమైన పునాది వేసే సమయం, అన్నంపెట్టే రైతుకి అన్నం పెట్టాల్సిన సమయం. ఆడబిడ్డలకు రక్షణగా ఉండాల్సిన సమయం. ప్రభుత్వ ఉద్యోగులకు మాటిస్తున్నా. ఏరు దాటాక తెప్ప తగలేసే రకం కాదు నేను. కాంట్రిబ్యూటరీ పెన్షన్ గురించి మరచిపోలేదు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కు సరిసమానంగా సంవత్సరంలోగా న్యాయం చేస్తాం. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయించే బాధ్యత మాది.”
“నూటికి నూరు శాతం గెలిచాం. 175 సీట్లు మనమే గెలిస్తే ఎంత బాధ్యత ఉందో అంత బాధ్యత మాపై ఉంది. ఆ బాధ్యతతో మేము పనిచేస్తాం. యువత, ఆడబిడ్డలు పడిన ఇబ్బందులను మరచిపోలేదు. రోడ్లు వేయకుండా గుంతలు వేశారు. అరాచకాలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడే బాధ్యత మాది.అధికారులపై రాజకీయ ఒత్తిడి ఉండదు. రైతుకు కష్టమొస్తే అక్కున చేర్చుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. రాజకీయాల్లో నాకు డబ్బు అవసరం లేదు. డబ్బుకోసం, పేరుకోసం రాజకీయాల్లోకి రాలేదు. ప్రతి సగటు మనిషి కష్టాలను చూసి.. వారి భుజాన్ని కాయడానికి రాజకీయాల్లోకి వచ్చా. 2019లో ఓడిపోతే మానసిక స్థితి ఎలా ఉందో.. గెలిచినా మానసిక స్థితి అలాగే ఉంది. అదే ధైర్యంతో ఉన్నా. గెలుపు బాధ్యతను పెంచింది కానీ.. అహంకారాన్ని ఇవ్వలేదు.”
“భీమవరం, గాజువాకల్లో ఓడిపోయినపుడు నా పక్కన నన్ను నమ్ముకున్న కొద్దిమందే ఉన్నారు. గెలిచాక ఇంతమంది నా వెనుక ఉన్నారు. ఓటమి నాకు బలం, ఉత్సాహాన్ని ఇచ్చింది. అందరూ గెలుపుకు శుభాకాంక్షలు చెబుతుంటే భయమేసింది. ఇల్లు అలకగానే పండుగ కాదు. ధర్మం కోసం నిలబడితే.. ధర్మం మనకోసం నిలబడిందని నమ్ముతా. కనిపించే పరాశక్తికి, కనిపించని దేవుళ్లకు కృతజ్ఞతలు. పిఠాపురం ప్రజలు, పెద్దలకు, ఆడపడుచులకు, అక్కచెల్లెళ్లకు, కదం తొక్కిన యువతకు, జన సైనికులకు, జనసేన నాయకులకు, టీడీపీ నాయకులు, శ్రేణులకు ప్రత్యేక కృతజ్ఞతలు. పిఠాపురంలో ఓటర్లు పవన్ కల్యాణ్ ప్రజల్ని గెలిపించలేదు. ఐదుకోట్ల మంది ప్రజల్ని గెలిపించారు. ఓడిపోతేనే బలంగా నిలబడ్డా. ఆకాశమంత విజయం ఇచ్చాక ఇంకా బలంగా నిలబడతాం. నిర్మాణాత్మకంగా పనిచేస్తాం. మీ కష్టాల్లో మీ ఇంట్లో ఒకడిగా ఉంటానని మాటిస్తున్నా. ప్రతిఒక్కరూ మా వాడు అసెంబ్లీ అడుగుపెడుతున్నాడు. మా కోసం నిలబడ్డాడని చెప్పుకునేలా చేసి చూపిస్తా. ప్రభుత్వం ఎలా ఉండాలో చేసి చూపిస్తా.” అని పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు.