Srinivasa Rao: విధి నిర్వహణలో అమరుడయ్యారు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు. పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. మేమున్నామంటూ ప్రభుత్వం ఆదుకునేందుకు ముందుకువచ్చింది. 50 లక్షల పరిహారం, పూర్తి జీతం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో ఆసరాగా నిలిచింది. శ్రీనివాసరావుకు గౌరవంగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది.
ఈర్లపూడిలో జరిగిన ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు అంత్యక్రియలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మంత్రులు పువ్వాడ అజయ్, ఇంద్రకరణ్రెడ్డి శ్రీనివాసరావు పాడె మోసి నివాళులర్పించారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధు, ఎమ్మెల్యే రేగా కాంతారావు, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతకుమారి, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
అటవీ అధికారి శ్రీనివాసరావు హత్య తీవ్ర కలకలం రేపింది. యావత్ రాష్ట్రం ఉలిక్కిపడింది. పక్క రాష్ట్రాల నుంచి వచ్చి గుత్తికోయలే శ్రీనివాసరావును దారుణంగా హత్య చేశారని తెలుస్తోంది. ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అటవీ సిబ్బంది తమకు ఆయుధాలు ఇవ్వాలంటూ మరోసారి డిమాండ్ చేశారు. అటవీశాఖ ఉన్నతాధికారిని అడ్డుకున్నారు. విధి నిర్వహణలో తమకు రక్షణ లేకుండా పోయిందని.. తరుచూ దాడులు జరుగుతున్నాయని.. డైనమిక్ ఆఫీసర్ శ్రీనివాసరావును కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు అటవీ ఉద్యోగులు. మరోవైపు, పోడు భూముల వివాదాన్ని పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న సర్కారు వైఖరి వల్లే ఇంత దారుణం జరిగిందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
ఆరోపణలపై అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందించారు. వచ్చే డిసెంబరు నాటికి పోడు భూముల సమస్యలను పరిష్కరించేలా.. అర్హులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు అందించేలా.. సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి చెప్పారు. పక్క రాష్ట్రాల నుంచి అక్రమంగా తెలంగాణకు వలసవచ్చిన గుత్తికోయలు ఇలాంటి దారుణానికి పాల్పడటం సరైంది కాదన్నారు. గత కొన్నేళ్లుగా ఆయుధాలు ఇవ్వాలని అటవీశాఖ అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా.. చట్టపరంగా ఇది సాధ్యం కాదని తెలిపారు.
ఎఫ్ఆర్వో శ్రీనివాసరావుపై దాడి జరిగిన తీరు భయబ్రాంతులకు గురి చేస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు అటవీప్రాంతంలో ఎఫ్ఆర్వో శ్రీనివాసరావుపై దాడి జరిగింది. మంగళవారం ఉదయం అటవీ భూముల్లో నాటిన మొక్కల పర్యవేక్షణకు సెక్షన్ అధికారి రామారావుతో కలిసి శ్రీనివాసరావు వెళ్లారు. ఎర్రబోడులో మొక్కలు నాటినచోట గుత్తికోయలు పశువులను మేపుతున్నారనే సమాచారంతో.. అక్కడికి చేరుకున్న శ్రీనివాసరావు వారితో మాట్లాడుతున్నారు. ఇద్దరు గుత్తికోయలు వెనుక నుంచి ఒక్కసారిగా ఆయనపై దాడికి దిగారు. కత్తులు, గొడ్డలితో తల, మెడ భాగంలో దాడి చేశారు. శ్రీనివాసరావు కిందపడటంతో.. ఆయన గొంతు కోశారు. అత్యంత ఆటవికంగా ఎఫ్ఆర్వోను గుత్తికోయలు హత్య చేశారని తెలుస్తోంది.
ఎఫ్ఆర్వోతో పాటు వచ్చిన సెక్షన్ ఆఫీసర్ ను బెదిరించి పంపించేశారు. తీవ్ర గాయాలతో శ్రీనివాసరావు అపస్మారక స్థితిలో అక్కడే పడిపోయారు. విషయం తెలిసి పోలీసులు, అటవీశాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని శ్రీనివాసరావును ముందుగా చంద్రుగొండ పీహెచ్సీకి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో అంబులెన్సులో ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మార్గంమధ్యలోనే చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. శ్రీనివాసరావు హత్య.. తెలంగాణలో తీవ్ర కలకలం రేపింది.