Mallareddy : తెలంగాణ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఆర్పీఎఫ్ దళాలతో రాత్రంతా తన కుమారుడు మహేందర్ రెడ్డిని కొట్టించారని ఆరోపించారు. అందుకే ఛాతీలో నొప్పి వచ్చినట్టుందని అన్నారు. సూరారంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పెద్ద కుమారుడు మహేందర్రెడ్డి పరిస్థితిపై మంత్రి ఆస్పత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడారు. ఈ సమయంలో బీజేపీపై తీవ్రస్థాయిలో మల్లారెడ్డి మండిపడ్డారు. తాను కష్టపడి సంపాదించానన్నారు. నిజాయితీగా ఉన్నానని స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లు కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తనపై అక్రమంగా దాడులు చేస్తోందని మండిపడ్డారు. దాడులకు బెదిరేది లేదన్నారు.
మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్రెడ్డికి హైపర్ టెన్షన్ వల్లే అస్వస్థతకు గురైనట్లు వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు మంత్రి మల్లారెడ్డి ఆస్పత్రి వద్ద ధర్నాకు దిగారు. తన కొడుకును చూడనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమారుడికి ఏమవుతుందోనని భయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
సురారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన కొడుకును చూసేందుకు వెళ్లిన మల్లారెడ్డిని సీఆర్పీఎఫ్ బలగాలు అడ్డుకున్నాయి. దీంతో మల్లారెడ్డి ఆసుపత్రి బయట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇంకోవైపు ఐటీ సోదాల్లో నగదు, పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మల్లారెడ్డి ఇంటివద్ద భారీగా సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించి సోదాలు కొనసాగిస్తున్నారు.