Meta : టీనేజర్స్ మొబైల్ స్మార్ట్ ఫోన్లు లేకుండా ఉండలేకపోతున్నారు. అంతెందుకు పసిపిల్లలు కూడా ఫోన్లో వీడియోలు లేదా కార్టూన్లు చూపిస్తేగానీ తినడం లేదు. ఫోన్ చేతికి ఇస్తేగానీ కుదురుగా ఉండనంతగా మారాం చేసే స్థాయికి చేరారంటే పిల్లలను ఫోన్లు ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక ఫోన్ చేతికి వస్తే టీనేజర్లు ఏం చేస్తారో వారి తల్లిదండ్రులకు కూడా తెలియదు. ఫ్రెండ్స్ తో ఛాటింగ్, ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం కామన్. ఫ్రెండ్ షిప్ పేరుతో సోషల్ మీడియాలో కొత్త వ్యక్తులు తగులుతుంటారు. వారు మాయమాటలు చెప్పి పిల్లలను ఏమారుస్తారు. వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి… బ్లాక్ మెయిల్ చేసే కేసులు పెరిగిపోతున్నాయి. అందుకే మోసగాళ్ల చేతికి చిక్కకుండా ఉండేందుకు ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లలో కొత్త ఫీచర్లు తీసుకురానుంది మెటా సంస్థ. 16 ఏళ్లలోపు పిల్లలు(కొన్ని దేశాల్లో 18) ఏళ్ల పిల్లలను మైనర్లుగా పరిగణిస్తారు. వీరిని ఆన్ లైన్ ఫ్రాడ్ నుంచి కాపాడేలా… ఈ కొత్త ఫీచర్లు ఉపయోగపడనున్నాయని మెటా చెబుతోంది. సెట్టింగ్ లలో మారిస్తే… టీనేజర్లను ఆన్ లైన్ మోసాల నుంచి కాపాడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదే జరిగితే నిజంగా పేరెంట్స్ కి గుడ్ న్యూసే. ఎందుకంటే పిల్లలు ఎలాంటి వీడియోలు చూస్తున్నారో… ఏమేం షేర్ చేస్తున్నారో అర్థంగాక బుర్ర బద్దలు కొట్టుకుంటారు. పిల్లలు చెడిపోవడానికి ఇవన్నీ కారణమవుతున్నాయి. ఇక అపరిచితులకు, అనుమానాస్పద వ్యక్తులకు కూడా పిల్లలు మెసేజ్ లు పంపించకుండా మరిన్ని ప్రైవేట్ సెట్టింగులు డీఫాల్ట్ గా వస్తాయి. ప్రైవసీ ఫిల్టర్ లలో భాగంగా ఎవరు తమ ఫ్రెండ్ లిస్ట్, ట్యాగ్ లిస్ట్ చూడాలి… ఎవరు చూడకూడదు అనే సెట్టింగ్స్ ని మార్చుకునే వీలుంది. అలాగే ఇన్ స్ట్రాగ్రామ్ లో టీనేజర్స్, కొత్తవారితో కలిసి చూసిన మెసేజ్ లను డిలీట్ చేయడం కోసం వారి అకౌంట్లలో మెసేజ్ బటన్ ని తొలగించడాన్ని టెస్ట్ చేస్తోంది మెటా. అంతేకాదు టీనేజ్ పిల్లల అనుమతి లేకుండా వాళ్ల వ్యక్తిగత ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేయకుండా ప్రపంచ వ్యాప్తంగా ఒక వేదికను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఉంది మెటా. అందుకోసం నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్, ఎక్స్ ప్లాయిటెడ్ చిల్డ్రన్ – ఎన్సీఎమ్ఈసీ అనే ఎన్జీవో సాయం తీసుకోనుంది. ఈ కొత్త ఫీచర్లు వస్తే టీనేజర్లు సోషల్ మీడియా వాడకంపై తల్లిదండ్రుల్లో కాస్త టెన్షన్ తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.