Farm House Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ నోటీసులపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఎక్కడని ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. బీఎల్ సంతోష్కు ఈనెల 16 నుంచి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించినట్లు అడ్వకేట్ జనరల్ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. ఢిల్లీ పోలీసుల సాయంతో బీజేపీ ఆఫీసులో నోటీసులు అందించినట్లు వివరించారు. బీఎల్ సంతోష్ సిట్ ముందుకు వస్తే అసలు వాస్తవాలు తెలుస్తాయని హైకోర్టుకు వివరించారు. సిట్ విచారణ పారదర్శకంగా జరుగుతోందన్నారు.
సిట్ విచారణకు నిందితులు సహకరించడం లేదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో ఇంకా ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉందని ఏజీ అభిప్రాయపడ్డారు. నిందితులు బయట ఉంటే సాక్ష్యాలను తారు మారు చేసే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు. ఏజీ వాదనలపై స్పందించిన ధర్మాసనం…బీఎల్ సంతోష్ విచారణకు ఎందుకు హాజరుకావడం లేదని ప్రశ్నించింది.
బీఎల్ సంతోష్ చట్టాన్ని ఎక్కడా ధిక్కరించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది రామచంద్రరావు హైకోర్టుకు తెలిపారు. బీఎల్ సంతోష్ 41 సీఆర్పీసీని సవాల్ చేయాలనుకుంటున్నారా అని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. సిట్ ముందు హాజరయ్యేందుకు బీఎల్ సంతోష్ గడువు కోరుతున్నారా? అని అడిగింది. బీఎల్ సంతోష్ సిట్కు లేఖ రాశారని రామచంద్రరావు హైకోర్టుకు తెలిపారు. విచారణకు ఎందుకు హాజరు కాలేకపోతున్నారో లేఖలోనే చెప్పారని వివరించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. సుప్రీంకోర్టు ఉత్తర్వులు చూశాకే విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.