IT Raids : తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో రెండో రోజు ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. మల్లారెడ్డి కుమారులు, బంధువులు, వ్యాపార భాగస్వాముల ఇళ్లలోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇదే సమయంలో మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో వెంటనే సూరారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మహేందర్ రెడ్డికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.
మంగళవారం తెల్లవారుజామున 5 గంటల నుంచే మంత్రి మల్లారెడ్డి ఇళ్లలో ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. కేంద్ర పోలీసు బలగాల పహారాలో ఆయన నివాసంతోపాటు వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేశారు. తొలిరోజు మొత్తం 50 బృందాలు సోదాల్లో పాల్గొన్నాయి. ఐటీ అధికారుల తనిఖీల్లో భారీగా ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించారు. భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మెడికల్ సీట్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్లో మల్లారెడ్డి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారని సమాచారం. మంగళవార రాత్రి 9 గంటల వరకు ఐటీ సోదాలు జరిగాయి. రాత్రి వరకు దాదాపు 46 చోట్ల తనిఖీలు నిర్వహించారు. 50 టీమ్స్ తో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. 200 మందికిపైగా అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నారు.
రెండోరోజు మల్లారెడ్డికి చెందిన ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మా కాలేజీల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి , ఆయన కుమారుల ఇళ్లతోపాటు బంధువుల ఇళ్లలోనూ ఐటీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి.
మల్లారెడ్డి ఆగ్రహం
ఐటీ సోదాలపై మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్ష్యతోనే ఈ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. సూరారంలోని ఆస్పత్రి చికిత్స పొందుతున్ను కుమారుడిని చూసేందుకు బయలుదేరగా ఐటీ అధికారులు మల్లారెడ్డిని అనుమతించలేదు. దీంతో దొంగ వ్యాపారాలు చేస్తున్నానా అంటూ ఐటీ అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కొడుకును రాత్రంతా ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. 200మంది అధికారులను పంపించి దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మల్లారెడ్డి మండిపడ్డారు.