Telangana Loksabha Election Results: లోక్సభ ఎన్నికల కౌంటింగ్ మరికొన్ని గంటల్లో పూర్తి కానుంది. అయితే దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి హవా కొనసాగుతుండగా.. తెలంగాణలో మాత్రం బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ హోరా హోరీగా జరుగుతోంది. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎనిమిది మంది గెలుపొందగా.. బీజేపీ మూడు స్థానాల్లో విజయం సాధించింది. ఎంఐఎం నుంచి ఒక్క అభ్యర్థి గెలుపొందారు. మరికొన్ని ఐదు స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉండగా.. బీఆర్ఎస్ మాత్రం ఖాతా తెరవలేకపోయింది.
మెజార్టీ మార్క్..
రాష్ట్రంలో మొత్తం 17 స్థానాలకు ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కాగా, కాంగ్రెస్ అభ్యర్థి తొలి విజయం సాధించారు. ఖమ్మం అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి సుమారు 4.5లక్షల ఓట్ల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. ఇక, ఉద్యమాల పురిటిగడ్డ నల్గొండ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పేరిట రికార్డు విజయం నమోదైంది. ఇప్పటివరకు ఓట్ల లెక్కింపులో ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్న జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డికి 5,41,241కు పైచిలుకు మెజార్టీ వచ్చింది. ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న నేపథ్యంలో మరింత మెజార్టీ పెరిగే అవకాశం ఉంది. ఎప్పుడూ లేనంతగా కాంగ్రెస్ పార్టీకి ఈ రెండు స్థానాల నుంచి 4 లక్షల మెజార్టీ రావడం గమనార్హం. మరోవైపు భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి 2 లక్షల మెజార్టీతో గెలుపొందారు.
Also Read: కేసీఆర్ లెక్క మళ్లీ తప్పింది?
వార్ వన్ సైడ్…
నల్గొండ సెగ్మెంట్కు ఓ ప్రత్యేకత ఉంది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ పార్లమెంట్ స్థానం నుంచి ఎక్కువగా కాంగ్రెస్ అభ్యర్థులకు భారీ విజయాలు వరించాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా 2014, 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసినప్పటికీ.. ఆ పార్టీకి విజయం వరించలేదు. అదే విధంగా ఈ స్థానం నుంచి బీజేపీ పోటీ చేసినా.. నెగ్గలేదు. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగినప్పటికీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కానీ ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో వార్ వన్ సైడ్గా సాగింది. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి కుమారుడు బరిలో దిగడంతో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. దీనికితోడు సీపీఎం, సీపీఐలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడంతో రికార్డు విక్టరీ నమోదు చేసింది.