Chandrababu Naidu key Role in NDA and INDIA Alliances: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఊహించని రీతిలో ఉత్కంఠగా సాగుతున్నాయి. 400 స్థానాలు వస్తాయంటూ ప్రచారం చేసిన బీజేపీ ఫలితాల సరళిని చూస్తే ఇండియా కూటమి ఎన్టీయే కూటమికి దాదాపు గట్టిగానే దెబ్బకొట్టేలా కనిపిస్తోంది. కేవలం నలభై నుంచి 50 స్థానాల తేడాతోనే పోలింగ్ సరళి నువ్వా నేనా అన్న రీతిగా సాగుతోంది. ఇప్పటికే రాజకీయపండితులు ఒక అంచనాకు అయితే వచ్చేశారు. గత రెండు ఎన్నికల తరహాలో ఈ సారి బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అసవరమైనన్ని స్థానాలు సాధించే అవకాశాలు అంతంత మాత్రమేనని 400 కాదు కదా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సొంతంగా మెజారిటీ కష్టంగా మారబోతోంది బీజేపీకి. ఒక వేళ గెలిచినా తక్కువ మెజారిటీతోనే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఎన్డీఏ కూటమికి బాబు అవసరం
బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 272 స్థానాలలో విజయం లభించే అవకాశాలు క్లిష్టంగా మారే ఛాన్స్ లేకపోలేదు. ఒకవేళ అదే జరిగితే బీజేపీ అనివార్యంగా ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎన్డీయే భాగస్వామ్య పక్షాలపై ఆధారపడక తప్పదు. ఇక బీజేపీకి అత్యంత నమ్మకమైన మిత్రపక్షాలుగా ఉన్న జేడీయూ, జేడీఎస్, షిండే వర్గం శివసేనలు కూడా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. అవి కూడా చెప్పుకోదగ్గ స్థానాలలో విజయం సాధించే అవకాశాలు లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతుగా చెప్పుకోదగ్గ స్థానాలతో నిలిచే పార్టీ ఏదన్న ప్రశ్నకు రాజకీయ పండితులు తెలుగుదేశం పార్టీ మాత్రమే అని చెబుతున్నారు.
ఎన్డీయే భాగస్వామ్య పక్షాలలో అత్యధిక స్థానాలను గెలుచుకునే అవకాశం ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందని వారు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్డీయేలో చేరిన సంగతి తెలిసిందే. సో.. మరో సారి మోదీ నేతృత్వంలో కేంద్రంలో ఎన్డీయే సర్కార్ కొలువుదీరేందుకు ఆ పార్టీకి తెలుగుదేశం అండ గట్టిగా అవసరమౌతుందని చెబుతున్నారు. రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి 15 నుంచి 20 కు పైగా లోక్ సభ స్థానాలలో విజయం సాధిస్తుంది. అప్పుడు కేంద్రంలో బీజేపీ సర్కార్ ఏర్పాటులో తెలుగుదేశం పార్టీదే కీ రోల్ అవుతుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కింగ్ మేకర్ గా మారతారు. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ కు కచ్చితంగా మేలు జరుగుతుందని భావిస్తున్నారు.
Also Read: చంద్రబాబుకు బీజేపీ బంపరాఫర్.. 48 గంటల్లో నిర్ణయం ?
ఇండియా కూటమికీ చంద్రబాబే
అయితే బీజేపీకి ఒకవేళ బొటాబొటీగా మ్యాజిక్ ఫిగర్ వచ్చినట్లయితే అప్పుడు ఇండియా కూటమి కూడా చక్రం తిప్పే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఎగ్జిట్ అంచనాలను తలకిందులు చేస్తూ ఇండియా కూటమి 220 పైచిలుకు స్థానాల్లో విజయం దిశగా కొనసాగుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం పావులు కదుపుతుంది. ఏపీలో టీడీపీ 16 స్థానాల్లో విజయం దిశగా ముందుకు సాగుతోంది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిసేందుకు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది.
ఒకవేళ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిని వీడేందుకు సిద్ధపడితే.. బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగలనుంది. కానీ చంద్రబాబు ఇండియా కూటమిలో చేరేందుకు సిద్ధపడతారా లేక బీజేపీ కూటమితో కొనసాగుతారా అనేది లక్ష డాలర్ల ప్రశ్న. ఏది ఏమైనా దాదాపు 20 ఏళ్ల క్రితం ప్రతిపక్షాల కూటమితో ఏర్పాటు చేసిన థర్డ్ ఫ్రంట్ లో చక్రం తిప్పిన చంద్రబాబుకు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత మళ్లీ కేంద్ర రాజకీయాలలో కింగ్ మేకర్ గా అవతరించబోవడం విశేషమే.