Reasons Behind YCP Failure In AP Elections 2024: వైనాట్ 175 అంటూ నినాదం ఇచ్చిన వైసీపీకి ఈ సారి ఏపీ ఓటర్లు అనూహ్యంగా వై నాట్ 17 అంటూ తీర్పునివ్వబోతున్నారు. ఎగ్జిట్ పోల్స్ లోనూ తగ్గేది లేదంటూ కొన్ని ఎగ్జిట్ పోల్స్ అండతో తమకు 150కి పైగా స్థానాలు వస్తాయని వైసీపీ శ్రేణులు చెబుతూ వచ్చాయి. అయితే అవన్నీ దూదిపింజలా ఎగిరిపోయాయి. వైసీపీకి ఏపీ ఓటర్లు గట్టిగానే బదులు చెప్పారు. ఎన్నికలలో గెలుపోటములను ప్రభావితం చేసే అంశాలు ఎన్నో ఉంటాయి. అయితే ప్రస్తుతం వైసీపీ నేతలు తమ ఓటమికి కారణాలు వెదుక్కునే పనిలో ఉన్నారు. మహాభారతంలో కర్ణుడి చావుకు కారణాలు అన్నట్లు ఏపీ ఎన్నికల భారతంలో వైసీపీ ఓటమికి కారణాలు కూడా చాలానే ఉన్నాయి.
చంద్రబాబును రెండు నెలలుగా జైలులో ఉంచడంతోనే వైసీపీ పతనం మొదలయిందని చెప్పవచ్చు. జనరల్ గా జైలుకు వెళ్లినవారిపై జనంలో సానుభూతి ఉంటుంది. ఆ విషయం చంద్రబాబు విషయంలో మరోసారి నిరూపణ అయింది. అక్కడే వైసీపీ ఓటమికి తొలి అడుగు పడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. స్కిల్ కేసులో సాక్ష్యాలు లేకున్నా కేవలం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిచంద్రబాబును జైలుకు పంపారంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. రాష్ట్రంలోనే కాదు తెలుగు వారు ఎక్కువగా ఉన్న ఇతర ప్రాంతాలలోనూ చంద్రబాబుకు మద్దతు పెరిగిపోయింది. పైగా ఈ ఎపిసోడ్ కాస్తా టీడీపీ, జనసేనలు కలిసేందుకు దోహదం చేసింది. వారిద్దరి మధ్య మైత్రీ బంధం బలపడేందుకు బాబు జైలు ఉదంతం మరింతగా దోహదం చేసింది.
పేలిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బాంబు
ఇక ఏపీ ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా నేతల నోట ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బాంబు భారీగానే పేలింది. జనానికి ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదని భూములు లాక్కునేందుకు వైసీపీ సర్కార్ తెచ్చిన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని చంద్రబాబు ప్రచారం చేస్తూ వచ్చారు. చంద్రబాబు తన ప్రతి ప్రచార సభలోనూ ఈ చట్టాన్ని ప్రభుత్వం ఎలా దుర్వినియోగం చేయబోతోందో తెలియజేసే ప్రయత్నం చేసి ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. అయితే అది భూములపై సర్వహక్కులు కల్పించేందుకు తెచ్చిన చట్టం అంటూ వైసీపీ నేతలు కవర్ చేయడానికి ప్రయత్నించినా జనం మాత్రం నమ్మలేదు. దీనితో గ్రామీణ ప్రాంత ఓటర్లు అంతా జగన్ కు దూరం అవుతూ వచ్చారు.
Also Read: ఏపీ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ ఎవరు?
మంత్రుల మాట తీరు
అధికారం తమదే అన్న రీతిలో జగన్ మంత్రులు జనంలో ఆదరణ కోల్పోతూ వచ్చారు. వ్యక్తిగత విమర్శలే తప్ప నియోజకవర్గాలపై ఫోకస్ చేయలేకపోయారు. పైగా ప్రతి నియోజకవర్గంలో గతుకులు, గుంటలతో రోడ్లు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. ప్రతిపక్ష నేతలు ఎవరైనా విమర్శిస్తే వాళ్లను అడ్డగోలుగా దుర్భాషలాడుతూ తమ అహంభావాన్ని ప్రదర్శించేవారు. దానితో మంత్రులపై ఏపీ ఓటర్లకు వ్యతిరేక భావన కలిగింది. మంత్రులకు తగ్గట్లుగా నియోజక వర్గాల ఎమ్మెల్యేలు కూడా అదే తీరుగా ప్రవర్తించారు.
టీడీపీకి కలిసొచ్చిన కూటమి
ఇక ఏపీ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి ఒక రకంగా బీజేపీ పొత్తు కూడా కలిసి వచ్చిందనే చెప్పొచ్చు. బీజేపీతో పొత్తు కారణంగా ఎన్నికల సమయంలోనూ, పోల్ మేనేజ్మెంట్ విషయంలోనూ కూటమికి కలిసి వచ్చింది. ముఖ్యంగా ఎన్నికల సంఘం, పోలీసు అధికారుల నుంచి సహకారం లభించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఏపీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన టీడీపీ- జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కూడా ఎన్నికలపై ప్రభావితం చేసింది. ముఖ్యంగా సూపర్ సిక్స్ పేరిట టీడీపీ ప్రకటించిన మేనిఫేస్టో ఓట్ల వర్షం కురిపించిందని విశ్లేషణ. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. మహిళ ఖాతాల్లోకి నెలకు రూ.1500, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మెగా డీఎస్సీ, రైతుకు రూ.20వేలు పెట్టుబడి నిధి, తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి రూ.15 వేలు నగదు ఇలాంటి హామీలు టీడీపీ కూటమి విజయానికి కారణమయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ త్యాగం.. కూటమికి అధికారం
చంద్రబాబు జైళ్లో ఉన్న సమయంలో.. ఆయనను పరామర్శించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్..బయటకు వచ్చిన తర్వాత టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు బహిరంగ ప్రకటన చేశారు. అప్పటికే పొత్తు చర్చలు జరిగినప్పటికీ.. పవన్ నోటి నుంచి బహిరంగ ప్రకటన రావడం అదే తొలిసారి. బీజేపీతో పొత్తులో ఉంటూనే.. పవన్ చేసిన ప్రకటన ఏపీ రాజకీయాలను కీలక మలుపుతిప్పింది. ఆ తర్వాత పొత్తులోని బీజేపీని తీసుకురావటానికి పవన్ కళ్యాణ్ అనేక ప్రయత్నాలు చేశారు. చివరకు ఆయన ప్రయత్నాలు ఫలించి.. టీడీపీ, జనసేనతో బీజేపీ కూడా జట్టుకట్టింది. ఇక పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపులోనూ పవన్ కళ్యాణ్ త్యాగం చేశారనే చెప్పొచ్చు. కేవలం 21 సీట్లు, 2 లోక్ సభ స్థానాలను తీసుకున్న పవన్ కళ్యాణ్.. తన సోదరుడు నాగబాబు కోసం తీసుకున్న అనకాపల్లి ఎంపీ సీటును కూడా చివరకు బీజేపీకి త్యాగం చేశారు.
చంద్రబాబుతోనే అభివృద్ధి
గత ఐదేళ్ల కాలంలో నవరత్నాలు పేరిట వైసీపీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే రాష్ట్రాభివృద్ధికి సంక్షేమం, అభివృద్ధి అనేవి రెండు చక్రాలు లాంటివనే సంగతిని వైసీపీ విస్మరించిందనే వాదనలు ఉన్నాయి. అప్పులు తెచ్చి మరీ సంక్షేమ పథకాలు అమలుచేసిన జగన్ సర్కారు.. అభివృద్ధిని విస్మరించటంతో.. నగర ఓటర్లు కూటమి వైపు మొగ్గుచూపారు. ముఖ్యంగా విభజన జరిగి పదేళ్లు పూర్తైన రాజధాని లేదనే భావనే ఏపీ ప్రజల్లో వ్యక్తమైంది. మూడు రాజధానులంటూ ప్రచారం చేసిన వైసీపీ.. చివరకు ఆ విషయంలోనూ సక్సెస్ కాలేకపోయింది. దీంతో రాజధాని, పోలవరం పూర్తికావటంతో పాటుగా అభివృద్ధి కావాలంటే చంద్రబాబు మళ్లీరావాలనే భావన ఓటర్లలో వ్యక్తమైంది.
Also Read: అదో సెంటిమెంట్, జైలుకెళ్తే సీఎం ఖాయం
కలిసొచ్చిన శంఖారావం
ఇక నారా లోకేష్ చేపట్టిన శంఖారావం పాదయాత్ర కూడా టీడీపీ విజయానికి కారణమనే విశ్లేషణలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసిన నారా లోకేష్.. కార్యకర్తల్లో ధైర్యాన్ని తీసుకురాగలిగారు. అలాగే ఎన్నికలకు వారిని సన్నద్ధం చేయగలిగారు. వీటితో పాటుగా వైసీపీ పట్ల ఉన్న వ్యతిరేకతను.. చంద్రబాబు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. ఎన్నికల ప్రచార సమయంలో మండుటెండను సైతం లెక్కచేయక.. రోజుకు మూడు సభల్లో పాల్గొంటూ వైసీపీ విధానాలను ఎండగట్టారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ కూటమి వస్తే ఏం చేస్తామో ప్రజలకు వివరించగలిగారు. ఆ రకంగా మునుపెన్నడూ లేని రీతిలో టీడీపీ విజయానికి నాంది పలికారు నాయుడు గారూ..