Lok Sabha Elections Results 2024(Latest political news in India): కాంగ్రెస్ కూటమి అంచనాలను తలకిందులు చేస్తున్నది. ఎగ్జిట్ పోల్స్.. ఎగ్జాక్ట్ పోల్స్ కాదని తేల్చి చెబుతున్నది. తాము ఎగ్జిట్ పోల్స్ నమ్మబోమని, తమ పీపుల్స్ పోల్ ప్రకారం 295+ సీట్లు ఇండియా కూటమి గెలుస్తున్నట్టు తెలిపింది. కానీ, ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఇందుకు భిన్నంగా.. ఎన్డీయే కూటమే భారీ మెజార్టీతో కేంద్రంలో అధికారాన్ని చేపడుతుందని ఊదరగొట్టింది. 400 సీట్లు కాకున్నా.. అందుకు దరిదాపుల్లో ఎన్డీయే కూటమి సీట్లు సాధిస్తుందని నమ్మబలికింది. కానీ, ఎన్నికల ఫలితాల సరళి చూస్తే ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ కూటమి నిజంగానే వారు చెప్పినట్టు అంచనాలను తలకిందులు చేస్తూ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నది. ఇప్పటి వరకు ఎన్డీయే కూటమి 296 స్థానాల్లో ముందంజలో ఉండగా.. ఇండియా కూటమి 226 సీట్లల్లో లీడ్లో ఉన్నది.
ముందుగా ఊహించినట్టు బీజేపీ ఉత్తరాదిన వెనుకబడింది. యూపీ(80 సీట్లల్లో 43 స్థానాల్లో కూటమి ముందంజ)లో కాంగ్రెస్ కూటమి అనూహ్యంగా పుంజుకోవడంతో బీజేపీ ఖంగుతిన్నది. దక్షిణాదిలో తమిళనాడు(బీజేపీ కూటమి ఒక్క సీటులోనూ లీడ్లో లేదు), కేరళ(20 సీట్లల్లో బీజేపీ రెండు సీట్లల్లో మాత్రమే లీడ్లో)ల్లో ఇండియా కూటమికి తిరుగే లేకుండా ఫలితాలు కనిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్(42 సీట్లల్లో 10 స్థానాల్లో టీఎంసీ 31, కాంగ్రెస్ 1 సీట్లలో లీడ్లో ఉన్నది), మహారాష్ట్ర(48 స్థానాల్లో 30కిపైగా సీట్లల్లో కాంగ్రెస్ కూటమి ముందంజ)ల్లో కూటమికి మంచి ఫలితాలు వస్తున్నట్టు తెలుస్తున్నది. ఏపీలో మాత్రం కూటమి బీజేపీకి ఎక్కువ కలిసివచ్చేలా ఉన్నది. ఇక ఎప్పటిలాగే మధ్యప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, రాజస్తాన్ వంటి హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో బీజేపీ పట్టు నిలుపుకున్నట్టు ఫలితాల సరళి వెల్లడిస్తున్నది. కాగా, హర్యానాలో బీజేపీ, కాంగ్రెస్ల మధ్య టఫ్ ఫైట్ ఉన్నది. ఢిల్లీలో మాత్రం ఆప్ పట్టు నిలుపుకోకపోవడంతో బీజేపీ 5 సీట్లల్లో లీడ్లో ఉన్నది. ఛత్తీస్గడ్(11 సీట్లల్లో 10 సీట్లు), ఒడిశా(21 సీట్లల్లో 18 సీట్లు), జార్ఖండ్ (14 సీట్లల్లో 9 సీట్లు), హిమాచల్ ప్రదేశ్(4 సీట్లకుగాను 4 సీట్లు)లో బీజేపీ ఎక్కువ సీట్లల్లో ముందంజలో ఉన్నది. బిహార్లో ఎన్డీయే కూటమిలోని జేడీయూ మెజార్టీ స్థానాల్లో లీడ్లో ఉన్నది.
కానీ, ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టుగా ఎన్డీయే కూటమి గెలుపు నల్లేరు మీద నడకలా లేదు. కాంగ్రెస్ కూటమి టఫ్ ఫైట్ ఇస్తున్నది. ఆ కూటమి చెబుతున్నట్టుగా 295+ సీట్లు గెలుచుకున్నా.. ఆశ్చర్యపోయే పరిస్థితులు లేవు. దీంతో మూడో సారి నరేంద్ర మోదీ ప్రభుత్వం కొలువుదీరుతుందా? లేక మార్పు ఖాయం కానుందా? అనేది ఉత్కంఠగా మారింది.