Uttar Pradesh Election results(Politics news today India): ఢిల్లీలో అధికార పీఠాన్ని అధిరోహించాలంటే ఉత్తరప్రదేశ్ గుండా వెళ్లాలని చమత్కరిస్తుంటారు. ఈ రాష్ట్రంలో అత్యధికంగా 80 సీట్లు ఉన్నాయి. 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ మెరుగైన ఫలితాలను రాబట్టింది. ప్రధాని మోదీ స్వయంగా యూపీలోని వారణాసి నుంచి రెండు సార్లు ఘనవిజయాన్ని నమోదు చేశారు. బీజేపీకి రాజకీయ కేంద్రంగా ఉత్తరప్రదేశ్ ఉంటుంది. రామాలయం వంటి సున్నితమైన అంశాన్ని ఆయుధంగా రాజకీయాలు చేసే ఈ పార్టీకి యూపీ ముఖ్యమైన రాష్ట్రం. ఈ ఎన్నికల్లోనూ బీజేపీ నాయకులు పలుమార్లు రామ మందిర ప్రస్తావన తెచ్చారు. కానీ, ఈ సారి ఉత్తరప్రదేశ్లో బీజేపీ తన పట్టును కోల్పోతున్నట్టు కనిపిస్తున్నది. ఎన్నికల ఫలితాల సరళి చూస్తే ఇండియా కూటమి అనుకున్నదానికంటే అద్భుతమైన ఫలితాలను రాబట్టుతున్నది.
ఉత్తరప్రదేశ్లో తొలి రౌండ్లలో ఇండియా కూటమి.. ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ ఒంటరిగా బీజేపీని కట్టడి చేస్తున్నదని అర్థమవుతున్నది. యూపీలో 80 పార్లమెంటు స్థానాల్లో ఫలితాల సరళి ఇలా ఉన్నది. ఎన్నికల సంఘం వెబ్ సైట్ ప్రకారం 80 సీట్లల్లో బీజేపీ 35 స్థానాల్లో, సమాజ్వాదీ 34 స్థానాల్లో, కాంగ్రెస్ 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది. ఇండియా కూటమి 42 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. ఎన్డీయే కూటమి 38 సీట్లల్లో ముందంజలో ఉన్నది. అనూహ్యంగా ఇక్కడ బీఎస్పీ ఒక్క సీటులోనూ ఆధిక్యంలో లేదు.
కాగా, స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్పై వెనుకబడ్డారు. రాహుల్ గాంధీ ఈ సారి అమేథీలో కాకుండా సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించిన రాయ్బరేలీ నుంచి బరిలో నిలిచి లీడ్లో ఉన్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీని అమేథీలో ఓడించి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన స్మృతి ఇరానీ ప్రస్తుతం ఈ స్థానంలో వెనుకంజలో ఉన్నది. అమేథీలో కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీ లాల్ శర్మ ముందంజలో ఉన్నారు.
2019 లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి 64 సీట్లు గెలుచుకుంది. ఇందులో 62 స్థానాలను బీజేపీ గెలిచింది.