Traffic diversions in Hyderabad(Hyderabad news today): ఎన్నికల కౌంటింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ఉన్నందున హైదరాబాద్లోని కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఈ కేంద్రాల్లో రోడ్లపై రద్దీ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు ఇప్పటికే పోలీసులు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో వాహనదారులను ఇతర మార్గాలకు మళ్లించే అవకాశం ఉండనుంది.
ఈ రూట్లల్లో వెళ్లొద్దు!
ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నందున వాహనదారులు, ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో మొత్తం 16 కేంద్రాల్లో కౌంటింగ్ ఉందని అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేంద్రాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించే అవకాశం ఉంది. కావున వాహనదారులు కౌంటింగ్ కేంద్రాల వైపు వెళ్లకుండా ఇతర మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
పార్కింగ్ ప్రాంతాలివే..
ముషీరాబాద్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు దోమలగూడలోని ఏవీ కళాశాల, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ పాఠశాల వద్ద జరగనుంది. ఈ కేంద్రాల వైపు వచ్చే వాహనదారులు ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.
చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు బషీర్బాగ్లోని నిజాం కళాశాలలో ఉండనుంది. ఇక వాహనాలను నిజాం కళాశాల మైదానంలో నిలిపివేయాలి.
అంబర్పేట విషయానికొస్తే.. రాజా బహదూర్ వెంకట్రాం రెడ్డి ఉమెన్స్ కళాశాలలో లెక్కింపు ఉండగా.. వాహనాలను వైఎంసీఏ మైదానంతోపాటు శాంతి థియేటర్ పరిసర ప్రాంతాల్లో వాహనాలు పార్కింగ్ చేయాలి.
మలక్పేట ఓట్ల లెక్కింపును జీహెచ్ఎంసీ ఇండోర్ స్టేడయంలో నిర్వహించగా.. వాహనాలను జీహెచ్ఎంసీ గ్రౌండ్లో.. సనత్నగర్ నియోజకవర్గ ఓట్లను ఓయూ కాలేజ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ వద్ద లెక్కించనుండగా.. వాహనాలను ఎంబీఏ కళాశాలలో పార్కింగ్ చేయాలి. అదే విధంగా సికింద్రాబాద్ ఓట్ల లెక్కింపు ఓయూ క్యాంపస్లోని పీజీ రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో నిర్వహించగా.. సైక్లింగ్ వెల్లోడ్రాన్ ప్రాంతంలో వాహనాలు నిలపాల్సి ఉంటుంది. ఇక గోషామహల్ ఓట్లను కోఠి ఉమెన్స్ కాలేజీ వద్ద నిర్వహించగా..వాహనాలను అదే కళాశాల మైదానంలో నిలపాలి.
Also Read: తెలంగాణలో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం..
చార్మినార్ ఓట్ల లెక్కింపును నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలోని కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తుండగా.. వాహనాలను ఎంజే మార్కెట్, హైదరాబాద్ అడ్మిట్ కార్యాలయం పక్కన పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. యాకుత్ పురా విషయానికొస్తే.. ఎగ్జిబిషన్ మైదానంలోని సరోజినీనాయుడు వనితా మహా విద్యాలయంలో లెక్కిస్తుండగా.. భీమ్ సింగ్ రావు బడా వద్ద పార్కింగ్ ఉండనుంది. కార్వాన్ ఓట్లను మాసబ్ ట్యాంకు పాలిటెక్నిక్ కళాశాలలో లెక్కిస్తుండగా.. వాహనాలను కళాశాల వెనక లైన్లో చేయాలి. నాంపల్లి నియోజకవర్గ ఓట్లను మాసబ్ ట్యాంక్లోని జేఎన్టీయూలో లెక్కిస్తుండగా.. వాహనాలను హాకీ మైదానం.. బహదూర్ పుర ఓట్లను బండ్లగూడలోని అరోరా లీగల్ సైన్స్ అకాడమీలో లెక్కిస్తుండగా, వాహనాలను కళాశాలలో ఆవరణలో పార్కింగ్ చేయాలి. ఖైరతాబాద్, జూబ్లిహిల్స్ ఓట్ల లెక్కింపును యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఇండోర్ స్టేడియంలో లెక్కించగా.. వాహనాలను బెటాలియన్ ఓపెన్ గ్రౌండ్స్లో నిలపాలి. ఇక చివరగా.. కంటోన్మెంట్ ఓట్లను సీఎస్ఐఐటీ, వెస్లీ కళాశాల ప్రాంగణంలో లెక్కిస్తుండగా.. వాహనాలను కళాశాల మైదానంలో పార్కింగ్ చేయాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.