AP election result updates(AP news today telugu): ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పుడ ఒక లెక్క అన్నట్టుగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. నాయకులు, కార్యకర్తల్లోనే కాదు.. సామాన్య పౌరుల్లోనూ పార్టీలపై స్పష్టమైన అభిప్రాయాలు ఏర్పడటంతో గట్టి పోటీ ఏర్పడింది. అందుకే అదే రీతిలో కొత్త ట్రెండ్ ఏపీలో కనిపించింది. తాను ఫలానా ఎమ్మెల్యే తాలూకా అని అభిమానులు హల్చల్ చేశారు. తమ అభిమాన నాయకుడే గెలుస్తాడనే ధీమాతోపాటు ఆ నాయకుడే గెలువాలనే బలమైన కాంక్ష కూడా ఈ ట్రెండ్ ద్వారా వ్యక్తపరిచారు. మరి తీర్పు ఎవరి తాలూకా? ఇది ఈ రోజు మధ్యాహ్నంకల్లా చూచాయగానైనా తెలిసిపోనుంది. కానీ, పార్టీలు మాత్రం తమదంటే తమదే గెలుపు అని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 8 గంటల నుంచి ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియలో తక్కువ రౌండ్లు ఉన్న కొవ్వూరు, నరసాపురం స్థానాల్లో రిజల్ట్ మొదటగా వెలువడనుంది. భీమిలి, పాణ్యం ఫలితాలు కాస్త ఆలస్యం అవుతాయి.
నవరత్నాలు మెరిసేనా?
అధికార వైసీపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయాన్ని నమోదు చేసింది. 151 సీట్లతో తిరుగులేని శక్తిగా నిలిచింది. అదే ధీమాతో ఈ సారి కూడా ఎన్నికల గోదాలోకి దిగింది. జగన్ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసింది. మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి కల్పన, పెట్టుబడులు వంటి వాటిపై ఎక్కువ శ్రద్ధ చూపలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ నవరత్నాల లబ్దిదారులపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నది. యువత ఓట్లపై ఆశలు చాలా వరకు వదిలిపెట్టుకుందనే చెబుతున్నారు. మరి ఈ నవరత్నాలు వైసీపీని గెలపిస్తాయా? లేదా? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. వై నాట్ 175? వై వైసీపానా? అనేది తెలిసిపోతుంది.
బాబు ట్రాక్ రికార్డ్ పెద్ద ప్లస్సు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడి పాలనను ఇప్పటికీ ఏపీ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఐటీలో చంద్రబాబు నాయుడి చొరవ లక్షలాది కుటుంబాలను మెరుగుపరిచిందని ఇప్పటికీ చర్చిస్తున్నారు. ముఖ్యంగా యువతలో ఈ టాపిక్ హాట్ హాట్గా ఉన్నది. చదువుకున్న యువత ఉద్యోగాల కోసం వలస వెళ్లడంపై అసహనం ఉన్నది. చంద్రబాబు అధికారంలోకి వస్తే తమ రాష్ట్రంలోనే ఎంచక్కా కొలువులు చేయొచ్చు కదా అనే అభిప్రాయాల్లో ఉన్నారు. ఇంటి పెద్దల్లోనూ ఇలాంటి అభిప్రాయాలే ఉన్నాయి. మాకు వచ్చే పింఛన్ కంటే పిల్లల భవిష్యత్ ముఖ్యం కదా.. అనే సమాధానాలే ఎక్కువగా వినిపించాయి. చంద్రబాబు ట్రాక్ రికార్డ్ విపక్ష శిబిరానికి పెద్ద ప్లస్సు అని ఈ నేపథ్యంలోనే చెబుతున్నారు.
పవన్ పక్కా
పవన్ కళ్యాణ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం.. బీజేపీ, టీడీపీల దరి చేరిన తర్వాత వైసీపీ ప్రభుత్వంపై వీరోచితంగా ఫైట్ చేయడం ప్రజల్లో ఆయన ఆదరణను పెంచింది. ఈ సారి ఆయనను గెలిపించాలని, గెలిస్తే ప్రజల కోసం మరింత ఫైట్ చేస్తారనే అభిప్రాయాలు ఉన్నాయి. పిఠాపురంలో పవన్ గెలుపు పక్కా అని జనసైనికులు ధీమాగా ఉన్నారు. కాగా, వంగా గీత గెలుపు ఖాయమే అని వైసీపీ అభిమానులు చెబుతున్నారు. బీజేపీ కూడా గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. సీట్ల సంఖ్యను పక్కనపెడితే ఓటు షేరు మాత్రం గణనీయంగా పెరుగుతుందని, ఇది రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా మంచి ప్రభావం చూపుతుందని విశ్లేషిస్తున్నారు.