TDP Leaders warm welcome to Chandrababu: పోలింగ్ తర్వాత తొలిసారి పార్టీ కార్యాలయానికి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబుకు సీనియర్ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల్లో విజయం ఖాయమనే అంచనాలతో అధినేతను చూడగానే అభ్యర్థులు సీఎం, సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
పోలింగ్ ముగిసిన తర్వాత చంద్రబాబు మొదటి సారి పార్టీ కార్యాలయానికి వచ్చారు. దీంతో టీడీపీ పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వద్ద చంద్రబాబుకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూటమికి అనుకూలంగా రావడంతో చంద్రబాబుకు ముందస్తు అభినందనలు తెలిపేందుకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఎన్టీఆర్ భవన్కు తరలివచ్చారు. సీఎం, సీఎం అనే నినాదాలతో ఎన్టీఆర్ భవన్ మార్మోగింది.
సంబరాలకు రేపటి వరకు శక్తిని కూడగట్టుకుని ఉండాలని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు తెలిపారు. ఎన్నికల్లో తన పర్యటనలను కోఆర్డినేట్ చేసిన బృంద సభ్యుల్ని చంద్రబాబు అభినందించారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్నిపెందుర్తి వెంకటేష్, పరుచూరి కృష్ణ, బండారు హనుమంతరావు పరుచూరి కృష్ణ, రవియాదవ్ తో పాటు పలువురు కోఆర్డినేట్ చేశారు. ప్రచారంలో భాగంగా రోజుకు 3 నుంచి 5 కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొనేలా సమన్వయం చేశారు. అయితే వారు బాగా పనిచేశారంటూ చంద్రబాబు వారిని అభినందించారు.
Also Read: కౌంట్ డౌన్ లబ్ డబ్.. 9 గంటల్లో ఫలితాలొస్తాయన్న సీఈఓ ముకేశ్ కుమార్ మీనా
సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. విజయం కోసం టీడీపీ, జనసేన బీజేపీ పార్టీల కార్యకర్తలు బాగా కష్టపడ్డారని తెలిపారు. కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులతో ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం సైకిల్ దినోత్సవం సందర్భంగా సైకిల్ తొక్కే ప్రతి ఒక్కరికీ చంద్రబాబు ప్రపంచ సైకిల్ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వ్యక్తిగతంగానూ, సమాజానికీ మేలు చేసే ఉత్తమ వ్యాయామం సైకిల్ నడపడం అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు సైకిల్ వాడాలని పిలుపునిచ్చారు.