Actor Sarath kumar performs angapradakshinam: ప్రముఖ సినిమా హీరోయిన్ రాధికా శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటన, అభినయంతో దక్షిణాదిన ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. అయితే, తను ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తమిళనాడులోని విరుద్ నగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. రాధికకు మద్దతుగా ఆమె భర్త, సీనియర్ నటుడు శరత్ కుమార్ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నాడు. ఈ లోక్ సభ ఎన్నికల్లో ఆమె విజయం సాధించాలంటూ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశాడు.
విరుద్ నగర్ లోని శ్రీ పరాశక్తి మారియమ్మన్ ఆలయాన్ని ఆదివారం రాత్రి సమయంలో రాధిక దంపతులు దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తరువాత శరత్ కుమార్ ఆలయ ప్రాంగణంలో పొర్లు దండాలు పెట్టాడు. తన భార్య ఎంపీగా గెలవాలంటూ అమ్మవారిని వేడుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: ఇప్పటివరకు అత్యధిక, అత్యల్ప మెజారిటీ సాధించిన నేతలెవరో తెలుసా?
అయితే, 2006లో రాధిక రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. తన భర్త శరత్ కుమార్ తో కలిసి ఆమె అన్నాడీఎంకే పార్టీలో చేరింది. వీరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ అదే సంవత్సరం పార్టీ వీరిని సస్పెండ్ చేసింది. ఆ తరువాత వీరు 2007లో ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి అనే పార్టీని స్థాపించారు. దానికి ఉపాధ్యక్ష హోదాలో రాధిక సేవలు అందించింది. కొద్దిరోజుల క్రితం ఆ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ఈ క్రమంలో ఆమె బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేశారు. విరుద్ నగర్ స్థానం నుంచి ఆమెకు పోటీగా దివంగత నటుడు కెప్టెన్ విజయకాంత్ కుమారుడు విజయ ప్రభాకరన్ బరిలో ఉన్నారు. ఇటు కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎంపీ అయిన మాణిక్కం ఠాగూర్ మరోసారి బరిలో ఉన్నారు. దీంతో ఇక్కడ త్రిముఖ పోరు నెలకొన్నది. ఈ స్థాయిలో ఆసక్తి నెలకొన్న ఈ పోరులో రాధికను గెలుపు వరిస్తుందో లేదో అనేది తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.
https://twitter.com/PRADEEPDEE2/status/1797532399242457490