Ex-BrahMos Engineer gets life term: బ్రహ్మోస్ మాజీ ఇంజనీర్ నిశాంత్ అగర్వాల్ కు నాగ్పూర్ కోర్టు జీవిత ఖైదు విధించింది. జీవిత ఖైదుతోపాటు జరిమానా కూడా విధించింది. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కోసం గూఢచర్యానికి పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది.
నిశాంత్ అగర్వాల్ ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) రోపర్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు. అనంతరం అతను బ్రహ్మోస్ ఏరోస్పేస్ లో ఇంజనీర్ గా పనిచేశాడు. అతని శ్రేష్ఠత, అంకితభావం కారణంగా అతికొద్ది కాలంలోనే బ్రహ్మోస్ ఏరోస్పేస్ లో నిశాంత్ అగర్వాల్ కు పదోన్నతి లభించింది. అంతేకాదు.. క్షిపణి ప్రాజెక్టులపై పనిచేస్తున్న బృందంలో నిశాంత్ అగర్వాల్ ముఖ్యమైన సభ్యుడు. అయితే, నిశాంత్ అగర్వాల్ ను మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్(ఏటీఎస్), ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ సంయుక్తంగా 2018 అక్టోబర్ లో నాగ్ పూర్ నుండి అరెస్ట్ చేశాయి. భారత్ భద్రతకు సంబంధించినటువంటి సున్నితమైన, రహస్య సమాచారాన్ని పాకిస్థాన్ తో పంచుకున్నట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి.
నిశాంత్ అగర్వాల్ ను అరెస్ట్ చేసిన తరువాత జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అతడిపై ఐటీ చట్టంతోపాటు అధికారిక రహస్యాల చట్టం కింద కేసులు నమోదు చేశారు. దర్యాప్తు సంస్థలు నిశాంత్ కంప్యూటర్లు, ఇతర డిజిటల్ పరికరాలను పరిశీలించి.. సున్నితమైన డేటా బదిలీ అయినట్లు కనుగొన్నట్లు పేర్కొన్నాయి.
Also Read: ఇప్పటివరకు అత్యధిక, అత్యల్ప మెజారిటీ సాధించిన నేతలెవరో తెలుసా?
అయితే, నిశాంత్ అగర్వాల్, అతడి కుటుంబ సభ్యులు మాత్రం ఈ ఆరోపణలు నిరాధారమైనవంటూ పేర్కొన్నారు. నిశాంత్ నిర్దోషి అని, అతడిని కావాలనే ఇరికిస్తున్నారంటూ వారు చెప్పారు. నిశాంత్ ఎప్పుడు కూడా రహస్య సమాచారాన్ని లీక్ చేయలేదన్నారు. అతను ఎల్లప్పుడు దేశానికి విధేయుడిగానే ఉన్నాడని నిశాంత్ తల్లిదండ్రులు పేర్కొన్నారు. నిశాంత్ అరెస్ట్, అతనిపై అభియోగాలు భారత రక్షణ రంగంలో పెను ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే.